2023లో కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డి సీఎం అవుతారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
నల్గొండ: 2023లో కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డి సీఎం అవుతారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.ఆదివారం నాడు ఆయన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.పీసీసీ చీఫ్ ఉత్తమ్ సాక్షిగా చెబుతున్నానని ఆయన చెప్పారు. రెండోసారి ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ సాగర్ కు వస్తున్నాడంటేనే జానారెడ్డి గెలిచినట్టేనని ఆయన చెప్పారు.
తామంతా కోరితేనే జానారెడ్డి పోటీ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 17వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా జానారెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ బరిలో ఉన్నాడు. బీజేపీ తరపున డాక్టర్ రవి నాయక్ పోటీ చేస్తున్నారు.
ఈ స్థానాన్ని నిలుపుకోవాలని టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. తమ సత్తాను చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓట్లు అభ్యర్ధుల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతాయి. గతంలో రెండు దఫాలు యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధుల చేతిలోనే జానారెడ్డి ఓటమి పాలయ్యాడు.