ఈ ఉద్యోగానికి ఎంపికైన దీప్తికి రూ. 2 కోట్ల వార్షిక వేతనం ఇవ్వనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో దీప్తి.. ఈ నెల 2వ తేదీన ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి చేశారు.
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతి అదరగొట్టింది. ఈ రోజుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాళ్లు చాలా మందే ఉండొచ్చు. అయితే.. ఈ అమ్మాయి మాత్రం అందుకు పూర్తి భిన్నం. కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా... సూపర్ ఉద్యోగాన్ని కొట్టేసింది. ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సంపాదించడంతోపాటు.. సంవత్సరానికి రూ.2కోట్ల జీతం అందుకోనుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన విద్యార్థిని నర్కుటి దీప్తికి అమెరికాలోని సియాటెల్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం లభించింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన దీప్తికి రూ. 2 కోట్ల వార్షిక వేతనం ఇవ్వనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో దీప్తి.. ఈ నెల 2వ తేదీన ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి చేశారు. అయితే అంతకు ముందే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాందించారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగిన సమయంలో దీప్తికి మెక్రోసాఫ్ట్, గోల్డ్ మెన్ సాక్స్, అమేజాన్ కంపెనీల్లో.. జాబ్ ఆఫర్స్ వచ్చాయి.
అయితే దీప్తి మాత్రం మెక్రోసాఫ్ట్లో ఉద్యోగం వైపు మొగ్గు చూపారు. ఇక, మెక్రోసాఫ్ట్ కంపెనీ ప్రతినిధులు దీప్తిని.. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్(ఎస్డీఈ) గ్రేడ్-2 కేటగిరిలో ఎంపిక చేసుకున్నారు. ఈ నెల 17 మెక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో దీప్తి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు ఇక, దీప్తి తండ్రి డాక్టర్ వెంకన్న(ఫొరెన్సిన్ నిపుణుడు) హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని క్లూస్ టీమ్స్కు నేతృత్వం వహిస్తున్నారు.
ఇక, దీప్తి విషయానికి వస్తే బీటెక్ పూర్తిచేసిన తర్వాత.. జేపీ మోర్గాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంఎస్ చేసేందుకు దీప్తి అమెరికా వెళ్లారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి.. క్యాంపస్ ఇంటర్వ్యూలో భారీ వేతనంతో జాబ్ సంపాందించారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించింది.