
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చులను విధిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో హజురాబాద్ ఉపఎన్నికపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పోటీ చేసే అభ్యర్థులకు నగదు రూపకంగా డబ్బులు ఇవ్వవద్దని, చెక్కులు, డి.డి.లు, ఆన్ లైన్ క్యాష్ ట్రాన్స్ ఫర్ మాత్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థులు బ్యాంకులో ఖాతా ఉండాలని, అది జీరో బ్యాలెన్స్ గా ఉండాలని స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతా నుంచే ఎన్నికల ఖర్చు లావాదేవీలు నిర్వహించాలని తెలిపారు.
ఇక ఎన్నికల ప్రకటన విడుదలైన తేదీ నుంచి వారం రోజుల లోపు స్టార్ క్యాంపెయిన్ కు వచ్చే వారి వివరాలను ముందుగానే అందించాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే పోస్టర్లు, కర పత్రాలపై పబ్లిషర్ పేరు తప్పకుండా ముద్రించాలని అన్నారు. ఎన్నికల ఖర్చు వివరాలను రోజువారిగా ఎన్నికల పరిశీలకుడికి అందించాలని తెలిపారు. ఎన్నికల ఖర్చులపై ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి., వి.వి.టి బృందాల నిఘా ఉంటుందని అన్నారు.
read more Huzurabad Bypoll:వాళ్లందరూ తుపాకులు అప్పగించాల్సిందే..: కరీంనగర్ సిపి ఆదేశాలు
అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే సమాచారం ఇవ్వాలని... ఆ వివరాలు పత్రికలలో, సోషల్ మీడియాలో, వెబ్ సైట్లో ప్రకటించాలని తెలిపారు. భారత ఎన్నికల కమీషన్ విధించిన నిబంధనలను అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు.
వీడియో
స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనే బహిరంగ సభలో 1,000 మంది వరకు, ఇండోర్ సమావేశాలకు 200 మందికి మించకుండా, సాధారణ సమావేశాలకు 500 మందికి మించకుండా నిర్వహించుకోవాలని తెలిపారు. రోడ్డు షో లకు బైక్, కార్లు, సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థితో పాటు అతడి రాజకీయ పార్టీ 20 వాహనాలను మాత్రమే వినియోగించుకొవాలని అన్నారు. ఎన్నికలకు 72 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని... రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని కలెక్టర్ తెలిపారు.
అంతకుముందు అక్టోబర్ 30న హుజురాబాద్ ఎన్నిక జరుగనుండగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. హుజురాబాద్ లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజి కళాశాలను అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, డిసిపి శ్రీనివాస్ లతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఎన్నిక ముగిసాక ఈ.వి.ఎం.లు, వీవీప్యాట్ లను భద్రపరచడంతో పాటు నవంబర్ 2న ఓట్ల లెక్కింపు నిర్వహించుటకు కళాశాలలోని ఆడిటోరియం హాల్, ఇండోర్ స్టేడియం, గ్రంధాలయ భవనం, తరగతి గదులని కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఏసిపి తులా శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు ల్యాండ్ సర్వే అశోక్,తహశీల్దార్ సుధాకర్, కలెక్టరేట్ ఏ.ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.