ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తో పాటు ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాల వాదనలను కూడ హైకోర్టు విన్నది. ఈ నెల 15కు విచారణను వాయిదా వేసింది.
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. ఓయూ విద్యార్ధి సుదేంద్రసింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గతంలోనే ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికసంఘాలు, ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టునోటీసులు జారీ చేసింది.ఇవాళ కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.
సమ్మెను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రకటించారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరించేలోపుగానే కార్మికులు సమ్మెకు వెళ్లినట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
బసు పాసులు కలిగి ఉన్నవారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ విషయమై అన్ని బస్ డిపోల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.
ఈ నెల 15వ తేదీన మళ్లీ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాము ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే ఉద్దేశ్యంతో సమ్మెకు దిగలేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. నెల రోజుల క్రితమే తాము ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినట్టుగా ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి.