జిహెచ్ఎంసీ ఎన్నికలు: బండి సంజయ్, ఓవైసీలపై పోలీసు కేసులు

By telugu teamFirst Published Nov 28, 2020, 9:22 AM IST
Highlights

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై బండి సంజయ్, అక్బరుద్దీన్ ఓవైసీలపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కూల్చివేతల వ్యాఖ్యలపై ఈ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులు వారిద్దరిపై సూమోటోగా కేసులు నమోదు చేశారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై వారిద్దరిపై కేసులు నమోదయ్యాయి. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత బండి సంజయ్, అక్బరుద్దీన్ ఓవైసీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

దారుసలాంను కూల్చివేస్తామని బండి సంజయ్ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు ప్రతిగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎర్రగడ్డ డివిజన్ ప్రచారంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధుల కూల్చివేత వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ ఓవైసీ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ బండి సంజయ్ దారుసలాంను క్షణాల్లో కూల్చివేస్తామని వ్యాఖ్యానించారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శల హోరు పెరుగుతోంది. డిసెంబర్ 1వ తేదీన జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 4వ తేదీన జరుగుతుంది. 

click me!