
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద సహాయ చర్యల్లో అపశృతి చోటు చేసుకుంది. బూర్గంపాడులో వరద బాధితులను తరలిస్తున్న నాటు పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 10 మంది వున్నారు. వెంటనే గమనించిన జాలర్లు , స్థానికులు 9 మందిని కాపాడగా.. ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. బాధిత వ్యక్తిని వెంకట్గా గుర్తించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 70 అడుగుల పైనే ప్రవాహం కొనసాగుతోంది. 70 అడుగులకు గోదావరి చేరడం ఇది మూడోసారి. 1986లో గోదావరి నది భద్రాచలం వద్ద 75.6 అడుగులకు చేరింది. 1990లో 70 అడుగులకు, తాజాగా మరోసారి 70 అడుగులకు చేరింది. అయితే ప్రస్తుతం 70 అడుగులకు పైగానే వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో వరద పోటెత్తింది.
Also REad:భద్రాచలం వద్ద 70 అడుగులకు చేరిన గోదావరి: రంగంలోకి ఆర్మీ
ముందుజాగ్రత్త చర్యగా భద్రాచలం వద్ద Bridge పై అధికారులు రాకపోకలను నిలిపివేశారు. 48 గంటల పాటు రాకపోకలను నిలిపివేయనున్నారు. మరో వైపు భద్రాచలం పట్టణానికి వచ్చే అన్ని మార్గాల్లో గోదావరి నీరు చేరింది. దీంతో భద్రాచలానికి వచ్చే మార్గాలు మూసుకుపోయాయి. గోదావరి నదికి వరద పోటెత్తితే భద్రాచలంలోకి వరద నీరుచేరకుండా ఉండేందుకు గాను ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో రామాలయానికి ఉత్తర భాగంలో కరరకట్టను నిర్మించారు . ఈ కరకట్ట ప్రస్తుతానికి భద్రాచలం పట్టణానికి రక్షణగా నిలిచింది. గతంలో 66 అడుగుల మేర వరద నీటిని ఈ కరకట్ట అడ్డుకొంది. అయితే ప్రస్తుతం 70 అడుగుల మేర నీరు వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం నుండి ఛత్తీస్ ఘడ్, ఏపీ, తెలంగాణ వైపు వచ్చే మార్గాలన్నీ నీటితో నిండిపోయాయి.
కాగా.. ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని ప్రభుత్వం కోరింది. 68 మంది సభ్యులుగల ఇంఫ్రాన్ట్రీ, 10 మంది సభ్యులుగల వైద్య బృందం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. వీరితో పాటు 23 మంది సభ్యులుగల ఇంజనీరింగ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటుంది. మొత్తం ఐదు బృందాలుగా ఉన్న ఈ సైనిక బృందంలో నలుగురు అధికారులు, ఐదుగురు జేసీఓలు, 92 మంది వివిధ ర్యాంకుల సభ్యులుంటారు.