
BRS working president KTR: కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ సంస్థలు నడుచుకుంటున్న తీరును యావత్ భారతావని గమనిస్తూనే ఉందని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మూగ ప్రేక్షకులుగా, కీలుబొమ్మలుగా మారాయని ఆయన ఆరోపించారు. అవినీతికి సంబంధించి ఇటీవల పలు కీలక విషయాలను బయటపెట్టిన జమ్మూకాశ్మీర్ మాజీ వర్నర్ సత్యపాల్ మాలిక్ అవినీతిని బయటపెట్టినందుకు అరెస్టు కావొచ్చునంటూ వ్యాఖ్యానించారు.
"ఈడీ, సీబీఐలు మూగ ప్రేక్షకులుగా, కీలుబొమ్మలుగా మారడాన్ని దేశం నిశితంగా గమనిస్తోంది. ఇప్పుడు మాజీ గవర్నర్ సత్యపాల్ జీని అరెస్టు చేస్తారని నేను అనుకుంటున్నాను" అని ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్ పై సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. అలాగే, అవినీతిపై గొప్పగా మాట్లాడటం సులభమని ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసునంటూ విమర్శలు గుప్పించారు. కర్ణాటక, అదానీల కమీషన్లు, అనేక తప్పిదాల విషయానికి వస్తే అవినీతి నిరోధక చర్యలు, నిబంధనలు వర్తించవంటూ చురకలంటించారు. కాగా, రూ.300 కోట్ల కిక్ బ్యాక్ ముడుపులకు సంబంధించిన ఫైలును క్లియర్ చేసేందుకు రాంమాధవ్ లాబీయింగ్ చేశారని సత్యపాల్ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు.
తెలంగాణ ఎస్ఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుడిని బెయిల్ పై విడుదల చేసిన బీజేపీ నేతలపై కేటీఆర్ మరో ట్వీట్ లో మండిపడ్డారు. ఈ కేసులో రెండో నిందితుడిని బీజేపీ నేతలు సన్మానిస్తున్న ఫొటోను బీఆర్ఎస్ నేత పోస్ట్ చేశారు. ఈ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను మొదటి నిందితుడిగా చేర్చడంతో ఆయన కూడా బెయిల్ పై విడుదలయ్యారు. అలాగే, దారుణమైన నేరాల్లో నిందితులను బీజేపీ కార్యకర్తలు సన్మానిస్తున్న ఇతర ఫొటోలను కూడా కేటీఆర్ పోస్ట్ చేశారు. బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల అనంతరం.. వారిని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సన్మానిస్తున్న ఫొటో కూడా షేర్ చేశారు. అలాగే, మహాత్మా గాంధీ బొమ్మున కాల్చిన బీజేపీ నాయకురాలి ఫొటో కూడా ఉంది.