
వరగల్ జిల్లా టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో.. దసరాకు ముందు రోజు రాజనాల శ్రీహరి కోళ్లు, మద్యం సీసాల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి ప్రభాకర్ అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు పంపాలని ఎన్నికల సంఘం వరంగల్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరంగల్ జిల్లా కలెక్టర్.. రాజనాల శ్రీహరికి నోటీసులు అందజేశారు. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ రిపోర్ట్ చేసింది.
కాగా, సీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో రాజనాల శ్రీహరి మద్యం బాటిళ్లు, కోళ్లను పంచిపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు.. నెటిజన్లు కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజనాల శ్రీహరి స్పందించారు. దసరా కానుకగా హమాలీలకు మద్యం, కోళ్లు పంచడంపై కొందరు కావాలనే తప్పుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించడం సంతోషంగా వుందన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. జాతీయ రాజకీయాలలోనూ కేసీఆర్ తనదైన ముద్ర వేసుకుంటారని శ్రీహరి జోస్యం చెప్పారు.