ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో తన బంధువుల ఇళ్లలో రూ.18.67లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు కట్టుకథ అల్లారంటూ బిజెపి ఎమ్మెల్యే ఱఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు.
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బులు దాచినట్లు తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటూ బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో తన బంధువుల ఇళ్లలో రూ.18.67లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు కట్టుకథ అల్లారని.. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ రఘునందన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్ద విచారణకు రాగా... ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని జడ్జి చెప్పారు. రఘునందన్ క్వాష్ పిటిషన్ను సీజే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి ఆదేశించారు.
read more దుబ్బాక బైపోల్ ఎఫెక్ట్: జీహెచ్ఎంసీపై టీఆర్ఎస్ జాగ్రత్తలు
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా గత నెల26న సిద్దిపేటలో రెవెన్యూ, పోలీసు అధికారులు రఘునందన్రావు మామ అంజన్రావు, మరో వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. ఈక్రమంలో అంజన్రావు ఇంట్లో రూ.18.67లక్షలు లభించాయని.. ఆ సొమ్మును ఉప ఎన్నికలో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసినట్లు సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ చెప్పారు. సీజ్ చేసిన నగదు తీసుకొస్తున్న సమయంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు రూ.12.80లక్షలను పోలీసుల నుంచి లాక్కెళ్లినట్లు.. వీడియో ఫుటేజీ ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు.
ఎన్నికల నుంచి తనను తప్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కుట్ర చేస్తోందని రఘునందన్ అప్పట్లో ఆరోపించారు. అదే కేసుపై తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.