పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై గృహ హింస కేసు.. భార్య బయటకు రాకుండా గోడ కట్టేసి..

By Sumanth KanukulaFirst Published May 14, 2022, 3:47 PM IST
Highlights

పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడు ఏక్‌నాథ్‌పై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు అతడిపై గృహ హింస కేసు నమోదు చేశారు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడు ఏక్‌నాథ్‌ రెడ్డిపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు అతడిపై గృహ హింస కేసు నమోదు చేశారు. ఏక్‌నాథ్ రెడ్డి తనను నిర్భంధించాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంట్లోనే ఉంచి గోడ కట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పంజాగుట్టు పోలీసులు.. ఏక్‌నాథ్‌పై వరకట్న వేధింపులతో పాటు గృహహింస కేసు నమోదు చేశారు. 

ఇక, గత కొంతకాలంగా ఏక్‌నాథ్ రెడ్డి దంపతుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. భార్యను ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఏక్‌నాథ్ అడ్డుకున్నాడు. వారుంటున్న భవనంలోని పైఅంతస్తు నుంచి తన భార్య కిందకు రాకుండా బంధించాలని ఏక్​నాథ్​ రెడ్డి తలచాడు. రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడను నిర్మించాడని తెలుస్తోంది. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

దీంతో ఏక్‌నాథ్ భార్య డయల్‌ 100కు ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించింది. దీంతో స్పందించిన పంజాగుట్ట పోలీసులు.. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెకు బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 ఇక, ఏక్ నాథ్ తండ్రి రాఘవరెడ్డి.. పుల్లా రెడ్డి గ్రూప్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఏక్‌నాథ్ రెడ్డి భార్య తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. 2014లో ఏక్‌నాథ్ వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది.

click me!