తెలంగాణ క్యాబినెట్ లో అనసూయ..

By SumaBala BukkaFirst Published Dec 4, 2023, 4:29 PM IST
Highlights

కాంగ్రెస్ ప్రభుత్వంపై నేడో, రేపో పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఈ క్రమంలోనే మంత్రివర్గంలో అనసూయకు తప్పనిసరి చోటు ఉంటుందన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. 

వరంగల్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది.  ఇవాళ రాత్రికే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వంలో మంత్రులు ఎవరు అనేది సర్వత్రా చర్చ నడుస్తోంది.  ఇప్పటి కొంతమంది పేర్లు మంత్రుల జాబితాలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశ ఉన్నట్లుగా సమాచారం. వారిలో ముందు వరుసలో ములుగు నుంచి ఎన్నికైన సీతక్క అలియాస్ ధనసరి అనసూయ ఉన్నారు.  

సీతక్క ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రేవంత్ రెడ్డికి సన్నిహితురాలిగా పేరుంది. దీంతో సీతక్కకు మంత్రివర్గంలో చోటు ఖాయమన్నట్టుగా వినిపిస్తోంది. ఇక మరోవైపు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆమె మొదటి నుంచి కాంగ్రెస్లో ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. 

దీంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవూరి ప్రకాష్ రెడ్డి తప్ప సీనియర్లు లేరు. ఈ అంశం కూడా సీతక్కకు, కొండా సురేఖలకు కలిసి వచ్చే అంశాలని అంచనా. ఈ కారణాలవల్లే వీరిద్దరికీ మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరి గురించి ఓ సారి చూస్తే... 

కొండా సురేఖ 
1995లో మండల పరిషత్ కు ఎన్నికయి ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1996లో పిసిసి సభ్యురాలుగా,  1999లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 99లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారిగా పనిచేశారు. అదే సమయంలో మహిళా శిశు సంక్షేమ కమిటీ,  ఆరోగ్యం, ప్రాథమిక విద్య స్టాండింగ్ కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఏఐసీసీ సభ్యురాలుగా ఉన్నారు.

ఆ తర్వాత 2004లో శాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. 2009లో పర్కల్ ఎమ్మెల్యేగా గెలిచి.. మరోసారి మహిళ శిశు సంక్షేమం, వికలాంగులు, జువెనైల్ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగులు జువెైల్ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వైయస్ మృతి తర్వాత.. వైఎస్ఆర్సీపిలో చేరినప్పటికీ ఆ తర్వాత దానికి రాజీనామా చేశారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ లో చేరి 2014లో వరంగల్ తూర్పు నుంచి గెలిచారు.కానీ 2018 ఎన్నికల్లో  కాంగ్రెస్లో చేరి పార్కల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే మళ్లీ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు.

ధనసరి అనసూయ 

ధనసరి అనసూయ సీతక్కగా మారడం వెనక నక్సల్స్ ఉద్యమం ఉంది.  ఆమె అందులో పనిచేసిన సమయంలో సీతక్కగా పేరు మార్చుకున్నారు.  ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసినప్పటికీ అదే పేరుతో  ఆమెను  ప్రజలు గుర్తించారు. మొదట ఆమె జననాట్యమండలిలో ప్రజా గాయకుడు గద్దర్, విమలక్క లాంటి వారితో కలిసి గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసేవారు. ఆ తర్వాత సాయిధ పోరాటంలోకి వెళ్లారు.1988లో నక్సల్స్ పార్టీలో చేరారు. పూలన్ దేవి రచనల నుంచి ప్రేరణ పొందారు.

ఎన్టీఆర్ హయాంలో  మావోయిస్టుల నుంచి నుంచి బయటికి వచ్చి  జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత లా చదువుకున్నారు.  ఈ క్రమంలోనే 2004లో తెలుగుదేశం పార్టీ నుంచి  అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆమెకు టికెట్ ఇచ్చారు. అలా రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటిసారి ములుగు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  2009లో మళ్లీ పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మరోసారి టిడిపి నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.  ఆ తర్వాత టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి చేరారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసి గెలిచారు.  2023 ఎన్నికల్లో కూడా గెలిచారు.  అయితే ఆమె పార్టీలు మారిన నియోజకవర్గాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.   అందుకే ఆమెను ములుగు సీతక్క అని కూడా పిలుచుకుంటారు ప్రజలు. 

click me!