
Vijayashanti: సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సంచలన విజయం సాధించిందని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లో 'కమలం వికసించింది... కాషాయం రెపరెపలాడింది' అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.
కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు చట్టాలను విపక్షాలు పెద్ద బూచిగా చూపించాయనీ, ఎన్నికల ఫలితాల మీద వాటి ప్రభావం లేనే లేదని అన్నారు. అలాగే.. బీజేపీని ముస్లిం వ్యతిరేక పార్టీగా, మతతత్వ పార్టీగా ప్రతిపక్షాలు ముద్రవేశాయని ఆరోపించారు. ఈ విజయం విపక్షాలకు పెద్ద చెంపపెట్టు అని విజయశాంతి పేర్కొన్నారు. బీజేపీపై ఎన్ని కట్టుకథలు అల్లినా .. ఓటర్లు నిజమేంటో గ్రహించారని చెప్పుకోచ్చారని అన్నారు.
ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నా... అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించిందని, అలాగే, హిందువులు తరతరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణంతో పాటు.... కాశీలో జ్ఞానవాపి మసీదుకు కూడా రక్షణ కల్పిస్తూ కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మించిందనీ, బీజేపీ జాతి సమగ్రత, జాతీయ సమైక్యత లక్ష్యంగా బీజేపీ పాలన కొనసాగుతోందనీ, ఆ పాలనకు ఫలితమే ఈ రోజు ఎన్నికల ఫలితాలను అన్నారు. అందుకు 37 ఏళ్ల తర్వాత రెండోసారి వరుసగా యోగి సర్కారు అధికారాన్ని దక్కించుకుందని తెలిపారు. అలాగే.. ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలకు రక్షణనిచ్చింది బీజేపీ పార్టీ అని ఆమె తెలిపారు.
కరోనా కష్ట కాలంలో పెద్దలను బీజేపీ ఆదుకుందని, మోడీప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించిందని తెలిపారు. అలాగే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ద కారణంగా .. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను ఒక్క పైసా వసూలు చేయకుండా స్వదేశానికి తరలిస్తోందని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క పంజాబ్ లో మాత్రమే బీజేపీ వెనుకబడిందని విజయశాంతి అన్నారు. భవిష్యత్ లో పంజాబ్ లోనూ కాషాయ జెండా ఎగురవేస్తామని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు .
ప్రస్తుతం.. కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందనీ, త్వరలో ఆ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నుంచి విముక్తి లభిస్తోందనీ, అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ.. కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతుండడంపైనా ఆమె స్పందించారు.
ఫెడరల్ ఫ్రంట్ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నడుంబిగించారని, మరి ఈ ఎన్నికల ఫలితాలతోనైనా కేసీఆర్ కు కనువిప్పు కలుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుందని విజయశాంతి అన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కే తెలంగాణ ఓటర్లు బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు.