
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వరద సాయంలోనూ ఇదే కనిపించిందని అన్నారు. ఈ విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి ఎన్డీఆర్ఎఫ్ నిధులూ కేటాయించని అన్నారు. దీనికి సంబంధించిన నివేదికను ట్విట్టర్ లో కల్వకుంట్ల కవిత పోస్ట్ చేశారు.
2020 సంవత్సరంలో హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలు వచ్చాయని కవిత గుర్తు చేశారు. దీంతో హైదరాబాద్ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. అయితే నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని ఆరోపించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరిని ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎండగట్టారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు అందించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల (ఎన్డీఆర్ఎఫ్) వివరాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. అయితే కేంద్రం విడుదల చేసిన నివేదికను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత, ఆ నివేదికలో తెలంగాణ రాష్ట్రం పేరు లేకపోవడాన్ని ఆమె ప్రస్తావించారు. వరదల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదని ఆరోపించారు. ప్రతీ అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని అన్నారు. ఈ వైఖరి వల్ల మనసు కలచివేస్తోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో అనేక రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసింది. అయితే ఇందులో తెలంగాణ కు మాత్రం ఎలాంటి నిధులు అందలేదు. వరద బీభత్సంతో అల్లాడిపోయిన తెలంగాణకు రూ.1,350 కోట్ల తక్షణ సాయం, మొత్తం రూ.5 వేల కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులివ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి గతంలోనే లేఖ రాశారు.