కేసీఆర్‌పై ఈటల, అర్వింద్‌.. కేటీఆర్‌పై బండి , మంత్రులే టార్గెట్‌గా బలమైన అభ్యర్ధులు.. బీజేపీ స్ట్రాటజీ ఇదే

Siva Kodati |  
Published : Aug 31, 2023, 08:19 PM IST
కేసీఆర్‌పై ఈటల, అర్వింద్‌.. కేటీఆర్‌పై బండి , మంత్రులే టార్గెట్‌గా బలమైన అభ్యర్ధులు.. బీజేపీ స్ట్రాటజీ ఇదే

సారాంశం

వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా మంత్రులను ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వీరిపై బలమైన అభ్యర్ధులను బరిలోకి దించుతోంది. 

నోటిఫికేషన్ వెలువడకముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికంటే ముందే ఒకేసారి 115 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసి విపక్షాలను డిఫెన్స్‌లోకి నెట్టారు. రేపో, మాపో మిగిలిన నాలుగు స్థానాలకు కూడా అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు గులాబీ దళపతి. అంతేకాదు.. ఈసారి వ్యూహాత్మకంగా తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నట్లు ప్రకటించి మరో బాంబు పేల్చారు కేసీఆర్. గజ్వేల్, కామారెడ్డిల నుంచి ఆయన బరిలో దిగనున్నారు. 

గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విపక్షాలు ప్రచారం చేస్తున్నా.. ముఖ్యమంత్రి వ్యూహం మరోలా వుంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన ఏ స్టెప్ వేసినా దాని వెనుక చాలా దూరాలోచన వుంటుందన్నది అందరికీ తెలిసిందే. కామారెడ్డిలో కేసీఆర్ బరిలోకి దిగడం ద్వారా ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా మారనుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కోల్పోయిన నిజామాబాద్ సీటును తిరిగి సాధించాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో వున్నట్లుగా తెలుస్తోంది. 

Also Read: పాలేరుపై ఆ ముగ్గురు ఫోకస్: ఎక్కరికి దక్కునో అవకాశం

కేసీఆర్ ఈ స్పీడులో వుంటే.. కాంగ్రెస్‌ టికెట్ల కేటాయింపుకు దరఖాస్తులు స్వీకరించింది. బీజేపీ అయితే ఇంకా సర్వేల దశలోనే వుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలోని అసంతృప్తులు వస్తే వారికి టికెట్లు కేటాయించాలనే వ్యూహంతో కమలనాథులు వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ అభ్యర్ధుల జాబితా ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వారంలోనే అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపిక విషయంలోనూ ఆ పార్టీ ఓ స్ట్రాటజీతో ముందుకు నడుస్తున్నట్లుగా సమాచారం. 

ఈ క్రమంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై ఎవరిని దించుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ముందుగా చెప్పినట్లుగానే కేసీఆర్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ వ్యూహాలను, బీఆర్ఎస్ అంగ బలం, అర్ధ బలాన్ని తట్టుకుని మరి హుజురాబాద్‌లో ఈటల గెలిచిన సంగతి తెలిసిందే. గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఈటలను, కామారెడ్డిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను పోటీ చేయించాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. 

అటు సిరిసిల్లలో కేటీఆర్‌పై బండి సంజయ్‌ని, సిద్ధిపేటలో హరీశ్ రావుపై బూర నర్సయ్య గౌడ్‌ను బరిలోకి దించాలని చూస్తున్నారు. వీరితో పాటు మంత్రులను ఓడించడమే టార్గెట్‌గా బలమైన అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో కాషాయ దండు బిజీగా వుంది. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌పై గుజ్జుల రామకృష్ణారెడ్డి, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్‌పై డీకే అరుణ, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి వంటి నేతలతో కలిపి మొత్తంగా 15 మందితో బీజేపీ తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి లోక్‌సభ ఎన్నికల్లో ఛాన్సివ్వాలని కమలనాథులు పావులు కదుపుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్
Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu