
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ నుంచి మునుగోడు ఉప ఎన్నిక బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయన సోమవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మునుగోడు ప్రజలకు, కేసీఆర్కు మధ్య ఈ పోటీ జరుగుతుందన్నారు. మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్ని నవంబర్ 3వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో దిగనుండగా.. టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. ఇప్పటికే మునుగోడులో విజయం కోసం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్.. అన్ని విధాలుగా సిద్దమయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఓటర్ల మద్దతు కూడగట్టేలా ప్రయత్నాలు ప్రారంభించాయి.