
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ భూకబ్జా వివాదంలో చిక్కుకున్నారు. భూకబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎ. మురళీ ముకుంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో తమ సొసైటీకి చెందిన భూమిని కబ్జా చేశారని ఆదివారం రాత్రి ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాట్ నెంబర్ 853/ఎఫ్ లోని 1,519 గజలా స్థలంపై కొంత కాలంగా వివాదం నడుస్తోందని, అది తమదేనంటూ వెంకాయ్యమ వాదించడమే కాకుండా ఆమె అనుచరులు సొసైటీకి చెందిన బోర్డును కూడా తొలగించారని ఆయన ఆరోపించారు.
బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ స్థలాన్ని కబ్జా చేసేందుకు వెంకయమ్మ, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అక్రమంగా పొందిన ఆ ప్లాట్ ను సిహెచ్ శిరీష దాన్ని పి. శ్రీహరికి గిఫ్ట్ డీడ్ చేశారని, ఆ తర్వాత శ్రీహరి 2020 డిసెంబర్ 31వ తేదీన ఎల్లోస్టోన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న పత్తిపాటి వెంకాయమ్మకు ఏజీపిఎ చేసినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.
ఈ ప్లాట్ వ్యవహారం ఇప్పటికే అటు న్యాయస్థానంలోనూ, ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు విచారణలో ఉంది. తాజాగా వెంకాయమ్మ రంగంలోకి దిగడంతో వ్యవహారం ఆసక్తికరంగా మారింది.