
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనకు సంబంధించి పోలీసులు 22 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు నిరసకు వాట్సాప్ గ్రూప్ల వేదికగా ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా కొందరు వ్యక్తులు ఆడియో సందేశాల్లో నిరసలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలంటే.. రైళ్లకు నిప్పుపెట్టాలని పేర్కొన్నట్టుగా చెబుతున్న క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక, ఈ నిరసనల వెనక గుంటూరులోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు కీలక సూత్రధారి అని పోలీసులు నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సుబ్బారావును అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వెనక సుబ్బారావుతో పాటు, మరికొన్ని కోచింగ్ అకాడమీల ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా కొన్ని న్యూస్ చానల్స్ కథనాలు ప్రచురించాయి. ఈ క్రమంలోనే పోలీసులు 22 మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనలో ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులే పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.
ఆందోళనల్లో పాల్గొన్న సాయి డిఫెన్స్ అకాడమీ చెందిన 450 అభ్యర్థులను పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. వీరంతా గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు.
గుంటూరుతో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉన్నట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక, వాట్సాప్ గ్రూప్ల వేదికగానే సికింద్రాబాద్ వద్ద నిరసన తెలిపేందుకు చాటింగ్లు జరిగినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని పలు న్యూస్ చానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో పలువురు.. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కోచింగ్ పొందారు. ఆ సమయంలో వీరు కొన్ని వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఆర్మీ రిక్రూట్మెంట్ గురించిన సమాచారం, ప్రిపరేషన్ టిప్స్ షేర్ చేసుకునేవారు.
అయితే మూడు రోజుల క్రితం అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన వెలువడగానే.. ఒక్కసారి ఈ వాట్సాప్ గ్రూప్లు యాక్టివ్ అయ్యాయి. అగ్నిపథ్ స్కీమ్ గురించి వాట్స్ప్ గ్రూప్లలో తీవ్ర చర్చ సాగింది. అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఆర్మీ తమ కేరీర్ అవకాశాలు దెబ్బతింటాయని వారు భావించారు. ఈ క్రమంలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా నిరసనల గురించి తెలియడంతో.. సికింద్రాబాద్ వద్ద కూడా నిరసన తెలియజేయాలని వారు వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజ్లు, ఆడియో క్లిప్స్ షేర్ చేసుకున్నారు.
హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్, 17/6 వంటి వాట్సాప్ గ్రూపులను సృష్టించి నిరసన కోసం రైల్వే స్టేషన్కు చేరుకోవడానికి యువతకు సందేశాలు పంపారు. శుక్రవారం నాటి హింసాకాండపై విచారణ జరుపుతున్న అధికారులు, ఆశావాదులకు శిక్షణ ఇచ్చేందుకు డిఫెన్స్ అకాడమీని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన సుబ్బారావు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. అతడితో పాటు కొన్ని ప్రైవేట్ అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షెల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారని సమాచారం. నిరసనల కోసం హైదరాబాద్కు వచ్చిన వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లు సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ నిరసనల వెనక 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందినవారు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం.