ఆదిలాబాద్ బోథ్ లో మావోయిస్టుల కలకలం: పోలీసుల కూంబింగ్, గ్రైనేడ్ స్వాధీనం

By narsimha lodeFirst Published Sep 1, 2022, 10:17 AM IST
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. బోథ్ అటవీ ప్రాంతంలో పోలీసులు గ్రైనేడ్ ను స్వాధీనం చేసుకున్నారు.  దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన చోటు చేసుకుంది. 
 

బోథ్: ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రకు సరిహద్దుల్లో ని ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పోలీసులకు సమాచాారం అందింది. ఈ సమాచారం ఆధారంగా బోథ్ సీఐ నైలు నాయక్ నేతృత్వంలో పోలీస్ బృందం కూంబింగ్ నిర్వహించింది. ఈ కూంబింగ్ లో  ఓ గ్రైనేడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోథ్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ప్రారంభం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన చోటు చేసుకుంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో  మావోయిస్టుల ప్రాబల్యం  ఉండేది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పోలీసులు తీసుకున్న చర్యలతో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు అప్పటి ఏపీ పోలీసుల నుండి ఇతర  రాష్ట్రాలకు చెందిన పోలీసులు కూడా సలహాలు సూచనలు తీసుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా మావోయిస్టు ల ప్రాబల్యం లేకుండా పోయింది. కొన్ని జిల్లాల్లో అప్పడప్పుడు మావోయిస్టుల కదలికలు కన్పించాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  ఎన్ కౌంటర్లు కూడా చోటు చేసుకొన్నాయి. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. పలు రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జనజీవనస్రవంతిలో కలిశారు.మరో వైపు మావోయిస్టు పార్టీలో రిక్రూట్ మెంట్ కూడా తగ్గిపోయింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రిక్రూట్ మెంట్ పై మావోయిస్టు పార్టీ కేంద్రీకరించినట్టుగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టు పార్టీలో రిక్రూట్ మెంట్ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామం కూడా మావోయిస్టు పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. తెలంగాణకు సరిహద్దుల్లోని చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర వంటి  రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నప్పటికి తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోయిందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో బోథ్ లో  మావోయిస్టుల కదలికలు చోటు చేసుకోవడంపై పోలీసులు  ఆరా తీస్తున్నారు.

 


 

click me!