పోలింగ్ విధుల్లో పాల్గొన్న 17మంది టీచర్లు, 2 లెక్చరర్లు మృతి.. హైకోర్టులో విద్యాశాఖ అఫిడవిట్...

By AN TeluguFirst Published Jun 24, 2021, 12:36 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పనిచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు 17 మంది, జూనియర్ కాలేజీ లెక్చరర్ ల లో ఇద్దరూ కరోనా కారణంగా మృత్యువాత పడ్డారని విద్యా శాఖ పేర్కొంది.  పోలింగ్ విధుల్లో ఉండగానే వారికి కరోనా సోకింది అన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది.  ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.  

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పనిచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు 17 మంది, జూనియర్ కాలేజీ లెక్చరర్ ల లో ఇద్దరూ కరోనా కారణంగా మృత్యువాత పడ్డారని విద్యా శాఖ పేర్కొంది.  పోలింగ్ విధుల్లో ఉండగానే వారికి కరోనా సోకింది అన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది.  ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.  

‘నాగార్జునసాగర్ ఉపఎన్నికతో పాటు వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.  విధుల్లో 9737 మంది ఉపాధ్యాయులు, 185 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.  అందులో 487 మంది టీచర్లు, ఐదుగురు అధ్యాపకులు కరోనా బారిన పడ్డారు. చనిపోయిన 17 మంది టీచర్లలో ఏడుగురు ఎస్జిటి,  8 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఒకరు పీఈటీ, మరొకరు టిఆర్టి.  వరంగల్ గ్రామీణ జిల్లా కు చెందిన వారు ఐదుగురు, నల్గొండలో నలుగురు,  జనగామ, ఖమ్మం జిల్లాలో ముగ్గురు చొప్పున, వరంగల్ అర్బన్ లో ఇద్దరు చనిపోయారు. బాధిత కుటుంబ సభ్యులకు అందాల్సిన ప్రయోజనాలను యుద్ధప్రాతిపదికన చెల్లిస్తాం’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కరోనాతో 177 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారారని ప్రభుత్వం తెలిపింది. వీరి సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ‘అనాథలుగా మారిన పిల్లలకు మూడేళ్లపాటు నెలకు రూ.2000 అందించనున్నాం. ఈ మేరకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల పూర్వ వివరాలు తెలియని చిన్నారులు బిసి రిజర్వేషన్లు పొందేలా బిసి-ఏ ధ్రువీకరణ పత్రం ఇప్పించనున్నాం. విద్యా సంస్థల్లో మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. 

అత్యవసర సమయాల్లో రక్షణ కోసం పిల్లలకు సాధారణ ఫీచర్లతో కూడిన మొబైల్ ఫోన్లు అందించాం. అందులో 1098, 100, సహాయ కేంద్రం, సిడబ్ల్యుసి సభ్యులు, డీసీపీయూ అధికారుల నెంబర్లు నమోదు చేశాం. దీంతో ఆపద సమయాల్లో ఆయా చిన్నారులను రక్షించేందుకు వీలవుతుంది.  కరోనా తో చనిపోయిన తల్లిదండ్రుల ఆస్తుల పై హక్కుల కోసం బాధిత చిన్నారులకు న్యాయసహాయం అందించాలని న్యాయసేవా సంస్థను కోరాం’ అని తెలిపింది.

కరోనా రెండోదశలో నిబంధనలు ఉల్లంఘించారని 10.34 లక్షల కేసులు నమోదు చేశామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 41.27 కోట్లు జరిమానా విధించామని పేర్కొంది.  బ్లాక్ మార్కెట్లో కరోనా మందులు, ఆక్సిజన్ వంటి వాటిని అమ్ముతున్న వారిని గుర్తించి ఇప్పటివరకు 171 కేసులు నమోదు చేసినట్లు వివరించింది.  జిహెచ్ఎంసి పరిధిలో ఈ నెల 1 నుంచి 20 వరకు 14,62,050 మందికి హరికృష్ణ ఫౌండేషన్ సహకారంతో, అన్నపూర్ణ పథకం కింద ఉచిత భోజనం అందించామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.

click me!