రికార్డ్స్ బ్రేక్: స్మార్ట్ ఫోన్ల కంటే‘జియో’పైనే మోజు!

By sivanagaprasad kodatiFirst Published Jan 27, 2019, 2:34 PM IST
Highlights

భారత్ మొబైల్ మార్కెట్‌లో ‘రిలయన్స్ జియో’ రికార్డులను తిరగరాస్తోంది. అంతా స్మార్ట్ ఫోన్లపై మక్కువ పెంచుకున్నా.. గతేడాది వాటికంటే ఎక్కువగా రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్లు అమ్ముడు పోయాయంటే దాని సత్తా ఏమిటో అర్థమవుతోంది.

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో గత రికార్డులనే షేక్ చేస్తోంది. అంచనాలన్నీ తలకిందులు చేస్తూ రిలయన్స్‌ జియో ఫోన్‌ దేశీయ మార్కెట్‌లో అద్భుతంగా రాణించింది.

2018లో 21% హ్యాండ్‌సెట్ మార్కెట్‌ను సొంతం చేసుకుంది. గతేడాది 290 మిలియన్ల జియో ఫీచర్ ఫోన్లు అమ్ముడు కావడం భారత్  బ్రాండ్ విక్రయాల్లో ఇదే అత్యధికం. అందునా ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్లపై మక్కువ పెంచుకున్నా.. వాటికంటే ఎక్కువగా అమ్ముడు పోయిన ఫోన్ ‘జియో ఫీచర్ ఫోన్’.

2018లో జియో ఫోన్‌ 38 శాతం ఫీచర్‌ ఫోన్ మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నది. 2017 చివర్లో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన జియో, కొత్త కొత్త మార్పులతో మార్కెట్ స్థితిగతులనే మార్చేసింది. డేటా ధరల్లో విప్లవావత్మక మార్పులు తెచ్చిన రిలయన్స్‌ జియో..ఇంటర్నెట్‌ను అందరికి అందుబాటులోకి తీసుకొవచ్చింది.

ఫీచర్ ఫోన్ల మీద ఆసక్తి కోల్పోయినా జియో ఫోన్‌..స్మార్ట్ ఫీచర్‌ ఫోన్‌గా వచ్చి ఇండియన్ యూజర్లను ఎక్కువగా ఆకట్టుకుంది. రిలయన్స్‌ జియో, జియో ఫోన్‌ కలిసి కాలింగ్ రేట్లను చాలా తక్కువ ధరకే అందిస్తుండటంతో వినియోగదారులు ఈ ఫోన్‌ను సెకండరీ డివైజ్‌గా ఎంచుకుంటున్నారు. 

ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్ 2018లో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్ కంటే వేగంగా వృద్ధి చెందింది. ‘భారత్‌లో స్మార్ట్‌ ఫోన్ల వినియోగం విస్తృతంగా పెరుగుతున్నా, ఎక్కువమంది ప్రజానీకానికి ఫీచర్‌ ఫోన్లు సరైనవే’ అని ఓ విశ్లేషకుడు పేర్కొన్నారు. జియో, శామ్‌సంగ్, ఐటెల్‌, నోకియా హెచ్‌ఎండీ, లావా ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో 72 శాతం వాటాను ఆక్రమించాయి.

స్మార్ట్ ఫోన్‌ మార్కెట్‌లో చైనీస్ దిగ్గజం జియోమీ (28 శాతం) రారాజుగా వెలుగొందుతుండగా, శామ్‌సంగ్ (24శాతం), వివొ (10 శాతం), అప్పో (8శాతం), మైక్రోమ్యాక్స్ (5శాతం) తరవాతీ స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది రికార్డులను బద్దలు కొడుతూ 2018లో 135 మిలియన్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. చైనా తరవాత భారత్‌దే అతిపెద్ద స్మార్ట్ ఫోన్‌‌ మార్కెట్‌.

click me!