ఎక్స్ ( ట్విట్టర్ ) సేవలకు అంతరాయం : 24 గంటల్లో రెండోసారి, యూజర్ల ఆగ్రహం.. ఫిర్యాదుల వెల్లువ

By Siva KodatiFirst Published Sep 19, 2023, 8:27 PM IST
Highlights

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్  ఎక్స్ (గతంలో ట్విట్టర్) సేవలకు 24 గంటల వ్యవధిలో రెండోసారి అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సమస్య ఎదురైంది. 

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్  ఎక్స్ (గతంలో ట్విట్టర్) సేవలకు 24 గంటల వ్యవధిలో రెండోసారి అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సమస్య ఎదురైంది. ఎక్స్ వెబ్ బ్రౌజర్‌తో పాటు ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ యూజర్లు ట్వీట్లను యాక్సెస్ చేయలేకపోతున్నారు. దీంతో వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. ఎక్స్‌లో యాక్సెస్ కోసం బలవంతంగా చెల్లింపులు స్వీకరిస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత సైట్ ఆగిపోయింది. ఎక్స్‌లో కొన్ని భాగాలు లోడ్ అవుతూ కనిపించగా.. కొందరికీ ట్వీట్‌లు లోడ్ చేయడం, టైమ్ లైన్‌ల విషయంలోనూ యూజర్లు సమస్యలను ఎదుర్కొన్నారు.

ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ మంగళవారం మధ్యాహ్నం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌లో ఎదురైన సమస్యలపై ఫిర్యాదుల ప్రవాహాన్ని చూపించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో మాట్లాడుతూ.. బాట్‌ల దాడిని నివారించడానికి చందా రుసుము అవసరమని చెప్పాడు. తాము నిజానికి చాలా తక్కువ ధరలతో ముందుకు వస్తున్నామని మస్క్ వ్యాఖ్యానించారు. ఇది సుదీర్ఘ కాలంగా చర్చకు వస్తోందని.. బాట్‌లకు వ్యతిరేకంగా ఇదే ఏకైక రక్షణగా ఆయన అభివర్ణించారు. 

కాగా.. గతేడాది ట్విట్టర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ పలు రకాల ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్‌కు చందాను వసూలు చేయడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ట్విట్టర్ బ్లూని ఇప్పుడు ప్రీమియంగా పిలుస్తున్నారు. గతంలో ట్విట్టర్‌లో ఉచితంగా అందించిన అనేక ఫీచర్లను ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ పేవాల్ కింద వుంచారు. సంపూర్ణ స్వేచ్ఛ, మరింత రిలాక్స్డ్ కంటెంట్ మోడరేషన్‌కు మద్ధతు ఇవ్వడంపై ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎక్స్ ప్రకటనల ఆదాయం భారీగా క్షీణించింది. దీంతో ఎక్స్‌కు కొత్త ఆదాయ మార్గాల అవసరం పడింది. అనేక మంది ప్రకటనదారులు ఎక్స్‌లో తమ ప్రకటనలను తగ్గించడమో పూర్తిగా నిలిపివేయడమో కొనసాగించారు.  
 

click me!