చైనా సంస్థలపై వ్యతిరేకత.. 2021 నుంచి ఫోన్ల కొనుగోళ్లపై నిషేధం..

By Sandra Ashok KumarFirst Published Jul 15, 2020, 2:10 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా చైనా సంస్థలపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ హువావే 5జీ పరికరాలపై నిషేధం విధిస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది.

లండన్: చైనా టెలికాం దిగ్గజ సంస్థ హువావేకు బ్రిటన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. తమ 5జీ నెట్​వర్క్ ​నుంచి హువావేను నిషేధిస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. బ్రిటన్‌లోని 5జీ నెట్‌వర్క్‌ల నుంచి 2027 కల్లా హువావే పరికరాలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది.

హువావేపై అమెరికా తాజా ఆంక్షలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు సైబర్‌ నిపుణుల నుంచి బ్రిటన్ లోని బోరిస్ జాన్సన్ సలహాలు తీసుకున్నది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అధ్యక్షతన జరిగిన నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ) సమీక్ష తర్వాత బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. 

ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ తరువాత 5జీ పరికరాలేవీ హువావే వద్ద కొనకుండా పూర్తిస్థాయి నిషేధం విధించింది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆధ్వర్యంలో జరిగిన బ్రిటన్ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఈ మేరకు తీర్మానాలు ఆమోదించింది.

'5జీ మన దేశ తీరునే మార్చనున్నది. అయితే ఆ నెట్‌వర్క్‌ మనదేశ భద్రత, మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నప్పుడే' అని బ్రిటన్ సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి ఓలివర్‌ డౌడెన్‌ పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి హువావే పరికరాలు వేటినీ యూకే 5జీ నెట్‌వర్క్​లో కొత్తగా అమర్చరని స్పష్టం చేశారు.

also read అమెజాన్, జియోమార్ట్‌కు పోటీగా ఇండియాలోకి వాల్​మార్ట్ ​.. ...

యూకే 5జీ నెట్‌వర్క్‌లో 2027కు హువావే పరికరాలే ఉండవని బ్రిటన్ సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి ఓలివర్‌ డౌడెన్‌ వివరించారు. వచ్చే ఎన్నికల నాటికి 2024 నాటికి 5జీ నెట్‌వర్క్ సేవలందించే హువావే పరికరాలను పూర్తిగా తొలిగిస్తామని పేర్కొన్నారు. బ్రిటన్​ హువావేను నిషేధిస్తున్నట్లు వచ్చిన వార్తలను అమెరికా స్వాగతించింది. 

5జీ నెట్​వర్క్​ నుంచి హువావేను తొలగిస్తూ బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే హువావే టెక్నాలజీని వినియోగించొద్దని చాలా దేశాలను కోరినట్లు ట్రంప్ చెప్పారు. 

కరోనా మహమ్మారితోపాటు చాలా విషయాల్లో చైనాపై అమెరికా కొంత కాలంగా ఆగ్రహంతో ఉండటం గమనార్హం. గత మే నెలలోనే హువావే ఉత్పత్తులను, సేవలను అమెరికా నిషేధించింది. హువావే అనుబంధ పరికరాలను అమెరికా సంస్థలు తయారు చేయొద్దని కూడా అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. 

5జీలో తమ ఉత్పత్తులు, సేవలను నిషేధిస్తూ బ్రిటన్ తీసుకున్న నిర్ణయం పట్ల హువావే విచారం వ్యక్తం చేసింది. దీనివల్ల డిజిటల్ యుగం దిశగా బ్రిటన్ అడుగులు నెమ్మదిస్తాయని పేర్కొంది. ఇదిలా ఉంటే హాంకాంగ్ మీద పూర్తి ఆధిపత్యం సాధించడానికి చైనా పార్లమెంట్ ఆమోదించిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టం అమలుకే పూనుకున్న నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

click me!