ఏజీఆర్ బకాయిల వల్లే 5జీ ట్రయల్స్ ఆలస్యం?

By Sandra Ashok KumarFirst Published Feb 22, 2020, 10:34 AM IST
Highlights

5జీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెల్కోల ఏజీఆర్​ బకాయిలు, హువావేపై అమెరికా ఆంక్షల వంటి కారణాల వల్ల 5జీ టెక్నాలజీ భారతదేశంలో అడుగు పెట్టడం జాప్యం అవుతున్నదని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణాలేమిటో పరిశీలిద్దాం.. 

న్యూఢిల్లీ: దేశంలో 1991లో ఆర్థిక సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చింతర్వాత టెలికాం రంగం ఓ వెలుగు వెలిగింది. కానీ ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఏజీఆర్​ బకాయిల చెల్లింపుల విషయమై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో దిగ్గజ టెలికం ప్రొవైడర్ సంస్థలు ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

బకాయిలను చెల్లించలేక అసమర్థతను వ్యక్తం చేస్తూ గడుపు పెంచాలని కేంద్రాన్ని వేడుకుంటున్నాయి రెండు సంస్థలు. తక్షణం చెల్లించాల్సి వస్తే వొడాఫోన్ ఐడియా దివాళా తీసే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుత సంక్షోభంతో టెలికం రంగ సంస్థల భవిష్యత్‌తోపాటు​ భారత్​కు ఎంతో అవసరమైన 5జీ టెక్నాలజీపైనా ప్రభావం పడనున్నది. 5జీ స్వీకరణలో ఆలస్యం మరింత పెరిగే అవకాశం ఉంది. 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలంటే టెలికాం సంస్థలకు అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుంది.

also read రిలయన్స్ జియో కొత్త లేటెస్ట్ రిచార్జ్ ప్లాన్... ఇతర నెట్వర్క్ల కంటే చౌకగా...

4జీ నుంచి 5జీకి రూపాంతరం చెందడానికి, స్పెక్ట్రమ్ కొనుగోలుకు వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.5జీ స్పెక్ట్రమ్​ ఒక మెగాహెట్జ్​ ధర రూ.492 కోట్లుగా ట్రాయ్​ నిర్ణయిస్తే​ వేలంలో పాల్గొనబోమని ఎయిర్​టెల్​ స్పష్టం చేసింది. పరిశ్రమ వర్గాలు కూడా 2020 ఏప్రిల్​-జూన్​ మధ్య జరగాల్సిన 5జీ ట్రయల్స్​ను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

‘రెండు, మూడేళ్ల తర్వాత 5జీ స్పెక్ట్రమ్​ వేలాన్ని నిర్వహించాలి. అప్పుడే 5జీ వాయుతరంగాలను ప్రభుత్వం సరిగ్గా లెక్కగట్టగలదు’ అని ఛాంబర్​ ఆఫ్ కామర్స్​ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది. ఒకవేళ టెల్కోల డిమాండ్లను అంగీకరిస్తూ ఏజీఆర్​ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం గడువు పెంచినా 5జీ టెక్నాలజీ రంగ ప్రవేశానికి మరో అడ్డంకి పొంచి ఉన్నది. 

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం హువావేపై  అమెరికా విధించిన ఆంక్షలే భారత విపణిలోకి 5జీ టెక్నాలజీ రంగ ప్రవేశానికి అడ్డంకులు కాన్నాయి. మొబైల్​ డేటా నెట్​వర్క్​లో హువావే సేవలపై నిషేధం విధించాలని మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. హువావే డేటా వినియోగించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. 

also read ఇండియాలోకి కొత్త బ్రాండ్ స్మార్ట్ ఫోన్....వివరాలు లీక్.....

హువావేతో ఒప్పందం కుదుర్చుకున్న దేశాలతో సమాచార మార్పిడిని నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్లు జర్మనీలోని అమెరికా రాయబారి తెలిపారు.అయితే చాలా చర్చల తర్వాత 5జీ ట్రయల్స్​లో హువావే పాల్గొనేందుకు భారత ప్రభుత్వం గతేడాది డిసెంబర్​లో అంగీకరించింది. 

హువావేకు భారతీ ఎయిర్​టెల్, వొడాఫోన్​ ఐడియా భాగస్వాములుగా ఉంటాయని ప్రకటించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ హువావేపై ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత రెండు దశాబ్దాల్లో భారతదేశం 2జీ నుంచి 4జీ టెక్నాలజీకి మారిపోయింది. ఈ-కామర్స్​, ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో కొత్త వాణిజ్య అవకాశాలకు 4జీ టెక్నాలజీ తెరతీసింది. 5జీ సాంకేతికతను స్వీకరిస్తే భారత్​ వృద్ధి జెట్​ స్పీడ్​లో దూసుకెళుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తాజా పరిణామాలపై ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్​ స్పందిస్తూ.. ‘5జీ స్పెక్ట్రమ్​తో​ కలిగే ప్రధాన ప్రయోజనం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ. ప్రస్తుతం సాధ్యంకాని చాలా డిజిటల్​ సేవలు 5జీ స్పెక్ట్రమ్​తో సాధ్యమవుతాయి’ అని పేర్కొన్నారు.

click me!