ఆసియా పారా గేమ్స్‌ 2023 : లాంగ్ జంప్‌లో గోల్డ్ మెడల్ కొట్టిన సురేష్ నిమిషా .. 15కు చేరిన భారత్ స్వర్ణాలు

Siva Kodati | Published : Oct 25, 2023 4:44 PM

ఆసియా పారా గేమ్స్‌ 2023లో భారతదేశానికి పతకాల పంట పండుతోంది. తాజాగా మహిళల లాంగ్ జంప్ టీ47 ఫైనల్‌లో సురేష్ నిమిషా బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడంతో భారత స్వర్ణ పతకాల సంఖ్య 15కు చేరింది.

Google News Follow Us

ఆసియా పారా గేమ్స్‌ 2023లో భారతదేశానికి పతకాల పంట పండుతోంది. తాజాగా మహిళల లాంగ్ జంప్ టీ47 ఫైనల్‌లో సురేష్ నిమిషా బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడంతో భారత స్వర్ణ పతకాల సంఖ్య 15కు చేరింది. 5.15 మీటర్ల జంప్‌తో నిమిషా మొదటి స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్‌లో కీర్తి చౌహాన్ 4.42 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ జంప్‌తో 4 వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 15 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలతో సహా 58 పతకాలతో ఆరో స్థానంలో ఉంది. పురుషుల, మహిళల 1500 మీటర్ల T11 ఈవెంట్‌లలో అంకుర్ ధామా, రక్షిత రాజు భారత్‌కు బంగారు పతకాలను అందించారు. మహిళల లాంగ్ జంప్ టీ47 విభాగంలో నిమిషా బంగారు పతకాన్ని అందుకుంది. 

 

 

అంతకుముందు భారత జావెలిన్ త్రోయర్ సుందర్ సింగ్ గుర్జార్ ఆసియా పారా గేమ్స్ 2023.. పురుషుల ఎఫ్ 46 విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే రెండుసార్లు పారాలింపిక్ బంగారు పతక విజేత దేవేంద్ర ఝఝరియా నాలుగో స్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్‌లో రింకూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇందులో భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. ఎఫ్ 46 కేటగిరీ అనేది.. అవయవ లోపం, బలహీనమైన కండరాల శక్తి వున్న ఆటగాళ్లను సూచిస్తుంది. 

పురుషుల 400 మీటలర్ టీ13 విభాగంలో అవ్నిల్ కుమార్ మూడో స్థానంలో నిలవడంతో భారత్‌కు కాంస్యం దక్కింది. టీ13 అనేది దృష్టి లోపంతో వున్న ఆటగాళ్లను తెలుపుతుంది. జావెలిన్ త్రోలో .. గుర్జర్ తన ఐదవ ప్రయత్నంలో 61.33 మీటర్లతో రజతం సాధించాడు. ఇతను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) సపోర్ట్‌తో 22 రోజుల పాటు ఫిన్‌లాండ్‌లో శిక్షణ పొందాడు. రింకూ కాంస్య పతకంతో పాటు వ్యక్తిగతంగా 60.92 మీటర్లను నమోదు చేయగా.. శ్రీలంక ఆటగాడు దినేష్ హెరాత్ 61.84 మీటర్ల త్రో తో ఆసియా రికార్డును బద్ధలు కొట్టాడు. 

అయితే ఇంచియాన్‌లో జరిగిన చివరి ఆసియా పారా గేమ్స్‌లో రజతం సాధించిన ఝఝురియాకు మాత్రం ఈసారి నిరాశ తప్పలేదు. ఖేల్‌రత్న అవార్డు గ్రహీత, భారతదేశానికి చెందిన గొప్ప పారాలింపియన్‌గా నిలిచిన ఆయన అత్యుత్తమ త్రో గా 59.17 మీటర్లు సాధించాడు. మరోవైపు పురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో అవ్నిల్ కుమార్ 52 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని కాంస్యం సాధించాడు. ఈ ఈవెంట్‌లో ఇరాన్‌కు చెందిన ఒమిద్ జరీఫ్‌సనాయే స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఇతను రేసును పూర్తి చేయడానికి 51.41 సెకన్ల సమయం తీసుకున్నాడు. 

కాగా.. ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో భారత బృందం అంచనాలకు మించి రాణిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే  ఇండియా 35 పతకాలు సాధించి ఔరా అనిపిస్తోంది. ఆసియా పారా గేమ్స్ పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం ఐదవ స్థానంలో వుండగా.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. త్వరలోనే టాప్ 3కి చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.