జగన్ మీద తేలిపోయిన జేసీ దివాకర్ రెడ్డి మాట: నిమ్మగడ్డ మొగాడురా బుజ్జీ!!

By telugu teamFirst Published Feb 4, 2021, 4:57 PM IST
Highlights

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు ఏపీలో సీఎం వైెఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వరని ఓ సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన మాటలను అపవాదు చేస్తూ నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం ఓ మాటన్నారు. ఆఖరి ప్రయత్నం కూడా అయిపోయిందని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నాన్ని ఆ మాటలు అన్నారనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలను పట్టుబట్టి ఆయన జరిపిస్తున్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్ జగన్ జరగనివ్వరని అందరూ అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా అదే మాట అన్నారు. వైఎస్ జగన్ రమేష్ కుమార్ హయాంలో ఎన్నికలను జరగనివ్వరని ఆయన అన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని చాలా సన్నిహితంగా చూడడం వల్ల ఆయన ఆ మాట అన్నారు. నిజానికి, అందరూ అదే అనుకున్నారు. కానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుబట్టి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. 

ప్రధానంగా ఆయన న్యాయస్థానాలను ఎన్నికలు నిర్వహించడానికి వాడుకున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు పెట్టడానికి చేసిన ప్రయత్నాలు, వాటిని అడ్డుకోవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసినవే. వాటిని ఇక్కడ తిరిగి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ వాటికి ఎదురొడ్డి నిలబడి ఆయన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చివరకు అధికార యంత్రాంగం, సిబ్బంది ఆయనకు సహకరించాల్సిన అనివార్యతలో పడ్డారు. దాన్ని అవకాశంగా తీసుకుని ఆయన తనదైన శైలిలో ఎన్నికల నిర్వహణకు నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా ఇంతకు ముందు చూడని పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది కూడా. 

ఎస్ఈసీ తన పరిధిని దాటి వ్యవహరించిందా, ప్రభుత్వం తన పరిధిని దాటి ఎస్ఈసీని నియంత్రించాలని ప్రయత్నించిందా అనే చర్చ సాగాల్సి ఉంది. మొత్తం మీద, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొగాడురా బుజ్జీ అని అనిపించుకున్నాడు.

click me!