గద్వాల కాంగ్రెస్‌లో టికెట్ పంచాయితీ.. లోకల్ వర్సెస్ నాన్ లోకల్..!!

By Asianet NewsFirst Published Aug 6, 2023, 11:41 AM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం చేరికల జోష్ నెలకొంది. అయితే ఇతర పార్టీల నుంచి నేతల చేరికలతో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయితీ నెలకొంటుంది. ఈ జాబితాలో గద్వాల నియోజకవర్గం కూడా ఉంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం చేరికల జోష్ నెలకొంది. అయితే ఇతర పార్టీల నుంచి నేతల చేరికలతో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయితీ నెలకొంటుంది. ఈ జాబితాలో గద్వాల నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఇద్దరు నేతలు టికెట్‌ కోసం బలంగా పోటీ పడుతున్నారు. అసలు గద్వాల నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుటుంబానికి గట్టి పట్టుంది. గతంలో డీకే అరుణ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో.. గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. అయితే డీకే అరుణ కాంగ్రెస్‌‌ను వీడి బీజేపీలో చేరినప్పటికీ ఆ పార్టీ క్యాడర్ మాత్రం బలంగానే ఉంది. 

గద్వాల నియోజకర్గం‌లో బహుజనుల ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. అయితే ఈ నియోజకవర్గంపై  రెడ్డి సామాజికవర్గందే ఆధిపత్యం. చాలా కాలంగా అక్కడ ఆ సామాజికవర్గానికి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో 1999లో మాత్రమే బీసీ సామాజికవర్గం నుండి గట్టు భీముడు టీడీపీ నుండి ఇక్కడి గెలుపొందారు.  

అయితే నియోజకవర్గంలో గెలుపోటములు డిసైడ్ చేసే బహుజనులు  కూడా ఈ సారి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా వినిపిస్తోంది. గద్వాల కాంగ్రెస్‌లో కూడా ఎమ్మెల్యే టికెట్ విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మలిచేటి రాజీవ్ ఆశపడుతున్నారు. ఇందుకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. 

అయితే రానున్న ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మలిచేటి రాజీవ్ ఆశపడుతున్నారు. ఇందుకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. 

అయితే సరిత తిరుపతయ్య ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఆమె స్థానిక బీఆర్ఎస్‌ నేతలతో ఉన్న విభేదాల కారణంగానే బీఆర్ఎస్‌లో చేరినట్టుగా చెబుతున్నారు. గద్వాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ అయినప్పటికీ.. ఆమె సొంత నియోజకవర్గం గద్వాల కాదని.. నియోజకవర్గానికి ఆమె నాన్ లోకల్ అవుతారని చెబుతున్నారు. దీంతో ఆమెకు గద్వాల  టికెట్ ఇవ్వొద్దని ఆమె వ్యతిరేక వర్గం కోరుతుంది. అలా చేస్తే స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పేర్కొంటున్నారు. 

అంతేకాకుండా.. జడ్పీటీసీగా గెలిచిన మొదటిసారే సరితకు అదృష్టం కలిసి జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యారని.. ఇప్పుడు వెంటనే ఎమ్మెల్యే కావాలని ఆమె భావిస్తున్నారని.. బీఆర్ఎస్‌లో టికెట్ దక్కదనే కాంగ్రెస్‌లో చేరారని ఆమె వ్యతిరేక వర్గం చెబుతుంది. స్థానిక నేతలతో విభేదాల వల్లే ఆమె హస్తం గూటికి చేరారని.. ఆమెకు బీఆర్ఎస్ అధిష్టానంతో ఎలాంటి సమస్య లేదని.. ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిస్తే తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్లరనే గ్యారెంటీ ఏమిటనే ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన డీసీసీ సమావేశంలో సైతం సరిత తిరుపతయ్య వ్యతిరేక వర్గం ఆమెకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేసింది. పటేల్ ప్రభాకర్ రెడ్డికి గానీ, మలిచేటి రాజీవ్‌ కి కానీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మలిచేటి రాజీవ్ విషయానికి వస్తే.. యూత్ కాంగ్రెస్‌ నాయకుడిగా ఆయనకు గుర్తింపు  ఉంది. నియోజకవర్గంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. రాజీవ్ రానున్న ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక, తెలంగాణలో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. గద్వాలను తిరిగి తమ కంచుకోటగా మార్చుకోవాలని భావిస్తోంది. అయితే ఇక్కడ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులకు సంబంధించి లోకల్- నాన్ లోకల్‌తో పాటు ఇతరత్రా రాజకీయ సమీకరణాలు ఉనప్పటికీ.. ఎవరికో ఒకరికి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. 

click me!