బాత్ బీహార్ కి: ప్రశాంత్ కిషోర్ "యువత" రాజకీయ వ్యూహమిదే...

By telugu teamFirst Published Feb 19, 2020, 4:41 PM IST
Highlights

ప్రశాంత్ కిషోర్ గతంలో జేడీయూ పార్టీలో చేరాడు. వారు ఇతనికి పార్టీ ఉపాధ్యక్షుడి పదివి కూడా ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ పిఆర్, ఎన్నార్సి లపై బీజేపీ వ్యతిరేక వైఖరిని తీసుకున్న కారణంగా ప్రశాంత్ కిషోర్ ని జేడీయూ పార్టీ నుండి ఇటీవల బహిష్కరించారు. 

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది మొదలు.... దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చాలా హాట్ హాట్ గా సాగిన ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు ఒక రకంగా విషాన్నే చిమ్ముకున్నారు. ఇంత హాట్ గా సాగినప్పటికీ బీజేపీ అత్యంత ఘోరంగా పరాజయం పాలయ్యింది. 

బీజేపీ ఓటమి చెందటంతో అరవింద్ కేజ్రీవాల్ ఒక దమ్మున్న నాయకుడిగా అవతరించాడు. అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా అతనికి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కూడా దేశవ్యాప్తంగా మరోసారి సంచలనంగా మారిపోయాడు. 

2014లో మోడీకి వ్యూహకర్తగా వ్యవహరించింది మొదలు అతని విజయ యాత్ర కొనసాగుతూనే ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటమి వల్ల కూడగట్టుకున్న ఏకైక ప్లాప్ తప్ప అతని యాత్ర అప్రతిహతంగానే కొనసాగుతుంది. 

జగన్ కి వ్యూహకర్తగా వ్యవహరించడం ద్వారా తెలుగునాట కూడా ప్రశాంత్ కిషోర్ బాగా పాపులర్ అయిపోయాడు. అలంటి ప్రశాంత్ కిషోర్ గతంలో జేడీయూ పార్టీలో చేరాడు. వారు ఇతనికి పార్టీ ఉపాధ్యక్షుడి పదివి కూడా ఇచ్చారు.

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ పిఆర్, ఎన్నార్సి లపై బీజేపీ వ్యతిరేక వైఖరిని తీసుకున్న కారణంగా ప్రశాంత్ కిషోర్ ని జేడీయూ పార్టీ నుండి ఇటీవల బహిష్కరించారు. 

ఆయన అలా బహిష్కరించిన తరువాత నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నితీష్ కుమార్ తన తండ్రిలాంటివాడు అంటూనే...దులపాల్సిందంతా దులిపాడు. ఇక ఆ ప్రెస్ మీట్లో బీహార్ పరిస్థితి 2005లో ఎలా ఉందొ ఇప్పుడు కూడా అలానే ఉందంటూ లెక్కలతోసహా చెప్పాడు. 

బాత్ బీహార్ కి అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు, బీహార్ ఎన్నికలనాటికి కోటి మంది యువతను చేరుకొని బీహార్ ను అభివృద్ధిచెందిన రాష్ట్రాల జాబితాలో ఎలా చేర్చాలో చెప్పాలనుకుంటున్నట్టు, బీహార్ వెనుకబాటుతనాన్ని అందరికి అర్థమయ్యేవిధంగా చెప్పనున్నట్టు చెప్పాడు. 

ఇలా బాత్ బీహార్ కి అనడం బీహార్ ఎన్నికలే లక్ష్యం అనే విషయం అర్థమవుతుంది. ఎన్నికలు 2020లోనే ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పటికిప్పుడు పార్టీని పెట్టి బీహార్ ఎన్నికల్లో పోటీచేసే ఆస్కారం అంతగా కనబడట్లేదు. అది చాలా కష్టతరమైన విషయం. 

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ అసలు ఇప్పుడు ఎం చేయబోతున్నాడనే ప్రశ్న సర్వత్రా నడుస్తుంది. ఇంకా కేవలం 6 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ కొద్ది కాలంలో పార్టీని స్థాపించి అందరిని కూడగట్టడం సాధ్యమయ్యే అవకాశం కనబడడం లేదు. 

మరి ప్రశాంత్ కిశోర్ ఎం చేయబోతున్నాడో మనకు అర్థమవ్వాలంటే..... ప్రస్తుతం బీహార్ రాజకీయ పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటుంది. 

నితీష్ కుమార్ కి ధీటైన మరో ముఖ్యమంత్రి పేస్ అక్కడ మనకు కనబడడం లేదు. బీజేపీలో కూడా అలంటి ఎవరు లేకనే బీజేపీ కూడా నితీష్ కుమార్ కి మద్దతు తెలుపుతుంది. ఉన్న ఆర్జేడీ పార్టీ ఇప్పుడు లాలు హయాంలోని ఆర్జేడీ ఎంత మాత్రమూ కాదు. 

ప్రస్తుతానికి కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య పొత్తు నడుస్తుంది. ఇవి అక్కడి రాజకీయ పరిస్థితులు. గత పార్లమెంటు ఎన్నికల వరకు ఇదే సీన్. కాకపోతే కన్నయ్య కుమార్ ఎప్పుడైతే పోటీకి దిగాడో అదృశ్యమయిందనుకున్న లెఫ్ట్ కూడా స్క్రీన్ మీద కనబడడం మొదలుపెట్టింది. 

తాజాగా ఎన్నార్సి విషయాన్నీ వ్యతిరేకిస్తున్న కన్నయ్య కుమార్ బీహార్ అంతా కలియతిరుగుతూ దానికి వ్యతిరేకంగా మద్దతును కూడగట్టే పనిలో ఉన్నాడు. కమ్యూనిస్టు పార్టీ జెండాలు పట్టుకొని వస్తున్న జనాలతోపాటు ఎందరో మంది సామాన్యులుసైతం ఆ సభ్యులకు భారీగా తరలివస్తున్నారు. 

ఉన్నప్రతిపక్షమంతా అక్కడ ఒక్కతాటిపైకి వచ్చే సూచనలు ప్రస్తుతానికి అయితే కనబడడం లేదు. కన్నయ్య కుమార్ పార్లమెంటు ఎన్నికల్లో బెగుసరాయ్ నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఆర్జ్ది పార్టీని అక్కడ అభ్యర్థిని నిలబెట్టొదని కోరినప్పటికీ ఆర్జ్డ్ మాత్రం వినలేదు. 

దీనికి బలమైన కారణం ఉంది. ఆర్జేడీని ఇప్పుడు లాలూ తనయుడు తేజస్వి యాదవ్ నడిపిస్తున్నాడు. అతని యూత్ ఇమేజ్ కి కన్నయ్య కుమార్ గండి కొడతాడన్న భయం వల్ల, కన్నయ్య కుమార్ గనుక పార్లమెంటుకు ఎన్నికైతే.... రాజకీయంగా తనకు ఎదురుదెబ్బ అని భావించిన తేజశ్వి అల్లా అక్కడి నుండి అభ్యర్థిని నిలబెట్టాడు. 

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ తోని సంప్రదింపులు జరపకుండానే.... ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజశ్వి యాదవ్ పేరును ఆర్జేడీ ప్రకటించింది. కాంగ్రెస్ దీనిమీద గుర్రుగానే ఉంది. 

కాంగ్రెస్ గుర్రుగా ఉండడానికి వారికేదో బలమైన నేత ఉన్నాడని కాదు... తేజశ్వి యాదవ్ ఎంతమేర ఈ ఎన్నికల్లో సమర్థవంతంగా కూటమిని ముందుకు నడుపుతాడో ఒక డౌట్ అయితే, ఇంకో మంచి బలమైన నాయకత్వం ఇంకో యువ కెరటం రూపంలో కనబడడం. 

అతనే కన్నయ్య కుమార్. అతను ఇప్పటికిప్పుడు ఏమి చెప్పుకున్నప్పటికీ.... అతడు మాత్రం పౌరసత్వసవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ... బీహార్ అంతా ముఖ్యంగా గ్రామీణ బీహార్ లో కాళ్లకు చక్రాలు కట్టుకొని ప్రయాణిస్తున్నాడు. 

అతడి సభలకు, రోడ్ షోలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆ సభలను చూసినవారెవరైనా తేజశ్వి కన్నా కన్నయ్యనే బెటర్ అనే స్థితికి చాలామంది కాంగ్రెస్ నేతలు వస్తున్నారు. 

అతడికి చాలామంది ఓపెన్ గానే మద్దతు పలుకుతున్నారు. గతంలో లెఫ్ట్ కాంగ్రెస్ కి మద్దతివ్వలేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఆర్జేడీ పరిస్థితేమిటంటే..... గతంలో అన్ని పార్టీలను కలిపి ఉంచి కూటమిగా ముందుకునడిపేవాడు లాలూ. ఇప్పుడు ఆ స్థితిలో ఆర్జేడీ లేదు. 

కనీసం యాదవులందరిని కూడా కూడగట్టలేని స్థితిలో ఉంది ఆర్జేడీ. ఎందరో లోకల్ స్థాయిలో యాదవ లీడర్లు పుట్టుకొచ్చారు. లాలూ రాజకీయాలంటే... గుండా రాజకీయాలనే బలమైన విమర్శను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ బాగానే సక్సెస్ అయింది. 

ఇక ఈ నేపథ్యంలో ఆర్జేడీని కాంగ్రెస్ వదిలేస్తుందా.... లేదా ఆర్జేడీ కూడా కాంగ్రెస్ మాట విని రాజకీయంగా పార్టీని రక్షించుకోవడం కోసం కన్నయ్యకు సపోర్ట్ చేస్తాడా అనేది చూడాల్సిన అంశం. 

ఇక ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే.... ఆయన కోటి మంది యువతను చేరుకుంటాను అని అన్నాడు. యువతను చేరుకోవడం అనడంలో ఆయన నవ నాయకత్వం అవసరమని చెప్పడం దాగుంది. 

ఆయన స్వయంగా రాజకీయ పోటీ ఇప్పుడే చేయకపోవచ్చు. ఆయనకు రాజకీయాలమీద వల్లమాలిన ప్రేమ అనేది ప్రశాంత్ కిషోర్ ని దగ్గరగా చూసిన వారెవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. 

సమయం తక్కువగా ఉన్నందున ఆయన ఎవరికైనా అనుకూలంగా పనిచేసే ఆస్కారం కనబడుతుంది. ఆయన ఎన్నికల్లో యువతను చేరుకుంటూ ముఖ్యంగా వారిని స్ట్రీమ్ లైన్ చేసే పనిలో పడొచ్చు. దానికి తోడు అతడి ప్రచారం ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాడో వేరుగా చెప్పాల్సిన వసరం లేదు. 

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో అన్నిటిని నిశితంగా గమనిస్తుంటే..... బీహార్ ఎన్నికల్లో ఒక నూతన ముఖ్యమంత్రి పేస్ మనకు కన్నయ్య కుమార్ రూపంలో కనబడనుంది. ప్రశాంత్ కిషోర్ మరోమారు తన రాజకీయ చతురతను, ప్లానింగ్ ను ఉపయోగించి బీజేపీని అధికారాన్ని దూరం చేసేందుకు మరోమారు వ్యూహాలను పన్నెందుకు సిద్ధమవుతున్నాడు. 

click me!