సిడ్నీలో భారతీయుడిని కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు..

By Sumanth KanukulaFirst Published Mar 1, 2023, 11:48 AM IST
Highlights

ఆస్ట్రేలియా పోలీసులు భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు. సిడ్నీలోని ఒక రైలు స్టేషన్ వద్ద క్లీనర్‌ను పొడిచి, పోలీసు అధికారులను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో వారు ఈ చర్య తీసుకున్నట్టుగా మీడియా నివేదికలు వెల్లడించాయి.

ఆస్ట్రేలియా పోలీసులు భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు. సిడ్నీలోని ఒక రైలు స్టేషన్ వద్ద క్లీనర్‌ను పొడిచి, పోలీసు అధికారులను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో వారు ఈ చర్య తీసుకున్నట్టుగా మీడియా నివేదికలు వెల్లడించాయి. మృతుడిని తమిళనాడుకు చెందిన మొహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32) గా గుర్తించారు. వివరాలు.. అహ్మద్ ఆస్ట్రేలియాలో బ్రిడ్జింగ్ వీసాలో నివసిస్తున్నాడు. అహ్మద్ ఫిబ్రవరి 28న సిడ్నీ వెస్ట్‌లోని ఆబర్న్ రైలు స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడిచాడు. 

అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పోలీసు స్టేషన్‌కు బయలుదేరాడు. అక్కడ పోలీసులను ఎదుర్కొన్న సమయంలో.. అహ్మద్ వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్టుగా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తాపత్రిక రిపోర్టు చేసింది. ఈ క్రమంలోనే ఒక పోలీసు అధికారి మూడు షాట్స్ కాల్చారు.. వాటిలో రెండు బుల్లెట్లు అహ్మద్ ఛాతీలో దిగాయి. దీంతో  అహ్మద్‌కు చికిత్స అందించడం మొదలుపెట్టారు. అహ్మద్‌ను వెస్ట్‌మీడ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అహ్మద్ మరణించాడు. 

మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో న్యూ సౌత్ వేల్స్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ స్టువర్ట్ స్మిత్ మాట్లాడుతూ..అధికారులకు స్పందించడానికి కేవలం సెకన్ల సమయం మాత్రమే ఉందని.. అహ్మద్ షూట్ చేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. ‘‘నేను ఆ అధికారులకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ఇది బాధాకరమైనది. ఇది మా పోలీస్ స్టేషన్లలో ఒకదానిలో ఒక ముఖ్యమైన సంఘటన’’ అని స్మిత్ పేర్కొన్నారు. అహ్మద్ మానసిక ఆరోగ్యాన్ని డిటెక్టివ్స్ పరిశీలిస్తున్నారని స్మిత్ చెప్పారు. అహ్మద్ చేతిలో దాడి గురైన క్లీనర్‌తో కూడా వారు మాట్లాడారని చెప్పారు. క్లీనర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని..పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. 

అహ్మద్ గుర్తింపును సిడ్నీలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది. ఈ ఘటన దురదృష్టకరమని తెలిపింది. పోలీసులకు అన్ని రకాల సహాయం అందిస్తున్నట్లు చెప్పింది. ‘‘భారతీయ జాతీయుడి కాల్పుల పరిస్థితులపై మేము పూర్తి నివేదిక అడుగుతున్నాం’’ అని పేర్కొంది. 

click me!