అబుదాబి: ఫ్లాట్‌లో శవాలుగా తేలిన భారతీయ దంపతులు

By Siva KodatiFirst Published Jul 26, 2020, 8:44 PM IST
Highlights

యూఏఈలో విషాదం చోటు చేసుకుంది. తాము నివసిస్తున్న ఫ్లాట్‌లోనే భారతీయ దంపతులు శవాలుగా తేలారు

యూఏఈలో విషాదం చోటు చేసుకుంది. తాము నివసిస్తున్న ఫ్లాట్‌లోనే భారతీయ దంపతులు శవాలుగా తేలారు. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాకు చెందిన జనార్థన్ పట్టీరీ, మినిజా దంపతులు 18 ఏళ్లుగా అబుదాబిలో నివసిస్తున్నారు.

జనార్థన్ ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తుండగా.. మినిజా ఛార్డర్డ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కరోనా కారణంగా జనార్థన్ ఇటీవలే తన ఉద్యోగం కోల్పోయినట్లుగా సమాచారం.

కొద్దిరోజుల క్రితమే తన కారును కూడా అమ్మేశాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉన్న జనార్థన్ కుమారుడు తల్లిదండ్రులతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అయితే వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వారికి ఫోన్ చేసి చెప్పాడు.

దీంతో వారు ఫోన్ తీసుకుని జనార్థన్ ఫ్లాట్‌ తలుపు కొట్టారు. కానీ అటు నుంచి సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్ధలు కొట్టి చూడగా.. జనార్థన్, మినిజా విగత జీవులుగా పడివున్నారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఏదైనా కుట్రకోణం వుందా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!