కిడ్ ఆఫ్ ది ఇయర్ గా.. భారత సంతతి బాలిక..!

By telugu news teamFirst Published Dec 4, 2020, 10:46 AM IST
Highlights

కరోనా సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘన, సైబర్‌ బెదిరింపులు, పర్యావరణ మార్పులు ఇలా ప్రస్తుతం తన తరంవారు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని గీతాంజలి ఆవేదన వ్యక్తం చేశారు. 

అమెరికాలో నివసించే భారత సంతతికి చెందిన ఓ బాలిక అరుదైన గుర్తింపు సాధించింది. ప్రతిష్ఠాత్మక ‘టైమ్‌' మ్యాగజైన్‌ తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌' విభాగంలో ఇండో-అమెరికన్‌ బాలిక గీతాంజలి రావు (15) సత్తా చాటారు. పోటీలో ఉన్న 5 వేల మందిని తోసిరాజని ఈ పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. ఈ మేరకు టైమ్‌ మ్యాగజైన్‌ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. 

కలుషితమైన నీటిని గుర్తించడం నుంచి మత్తు పదార్థాలకు బానిసవుతున్న వారిని రక్షించడం, సైబర్‌ బెదిరింపులు వంటి పలు అంశాలకు  సాంకేతికత సాయంతో గీతాంజలి పరిష్కార మార్గాన్ని చూపారని టైమ్‌ ప్రతినిధులు తెలిపారు. కరోనా సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘన, సైబర్‌ బెదిరింపులు, పర్యావరణ మార్పులు ఇలా ప్రస్తుతం తన తరంవారు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని గీతాంజలి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వీటికి సమర్థవంతమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. 

ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథమున్న యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని, యువతను సమ్మిళితం చేస్తూ, ఓ అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలన్నది తన అభిమతమని పేర్కొంది. కంటపడిన ప్రతీ సమస్యనూ పరిష్కరించాలని అనుకోవడం కన్నా, బాగా కదిలించిన సమస్య గురించి ఆలోచించి, పరిష్కారం కోసం ప్రయత్నిస్తే మంచిదని అభిప్రాయపడింది. ఈ తరం ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రతి ఒక్కరినీ సంతోషంగా చూడాలన్నదే తన లక్ష్యమని, దానికోసం సైన్స్ ను వినియోగించుకుంటానని అన్నారు.
 

click me!