చంద్రశేఖరే హంతకుడు.. 15రోజుల క్రితమే ప్లాన్ వేసి..

By telugu teamFirst Published Jun 19, 2019, 10:35 AM IST
Highlights

అమెరికాలో ఇటీవల తెలుగు కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. వారి చావు వెనకగల  అసలు కారణాలు ఒక్కొక్కటీ ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. 


అమెరికాలో ఇటీవల తెలుగు కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. వారి చావు వెనకగల  అసలు కారణాలు ఒక్కొక్కటీ ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడింది... కుటుంబ పెద్ద చంద్రశేఖర్ సుంకర అని పోలీసులు తేల్చారు. ముందుగా భార్య, బిడ్డలను దారుణంగా తుపాకీతో కాల్చిచంపి... అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

చంద్రశేఖర్ పెద్ద కుమారుడి ఆరోగ్యం సరిగా ఉండదని... ఈ కారణంతో ఆయన  గత కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కారణంతోనే  భార్య, బిడ్డలను చంపి తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

అయోవా రాష్ట్రంలోని వెస్ట్‌ డి మోయిన్‌ నగరంలోని వారి నివాసంలో శనివారం ఉదయం చంద్రశేఖర్‌తో పాటు ఆయన భార్య లావణ్య, కుమారులు ప్రభాస్‌, సుహాస్‌లు విగత జీవులై కనిపించిన సంగతి తెలిసిందే. వీరి మరణానికి కారణం తూటా గాయాలేనని పోస్ట్‌మార్టమ్‌లో తేలినట్లు పోలీసులు చెప్పారు. వీరి హత్యలకు గల ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా చంద్రశేఖర్ తుపాకీ గురించి ఓ ఆధారం బయటపడింది.

చంద్రశేఖర్ కి ఏప్రిల్ నెలలో గన్ లైసెన్స్ లభించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా... ఈ హత్యలు జరగడానికి సరిగ్గా 15 రోజుల ముందే తుపాకీని కొనుగోలు చేసినట్లు  తేలింది. వారు చనిపోయిన ఇళ్లు కూడా.. మార్చి నెలలోనే కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా.. ఇప్పుడు ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. 

click me!