కాల్ సెంటర్ కుంభకోణం.. 21 మంది భారత సంతతి వ్యక్తులకు అమెరికా శిక్ష

First Published Jul 21, 2018, 12:29 PM IST
Highlights

సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ కుంభకోణంలో 21 మంది భారత సంతతి వ్యక్తులకు అమెరికా న్యాయస్థానం శిక్ష విధించింది.

సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ కుంభకోణంలో 21 మంది భారత సంతతి వ్యక్తులకు అమెరికా న్యాయస్థానం శిక్ష విధించింది. 2012 నుంచి 2016 మధ్యకాలంలో అహ్మాదాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు నకిలీ కాల్‌సెంటర్ల ద్వారా అమెరికా పౌరులకు ఫోన్లు చేసేవారు. తాము భారత రెవెన్యూ అధికారులమని.. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులమని చెప్పి ఫోన్లు చేసేవారు.

డేటా బ్రోకర్లు, ఇతర మార్గాల ద్వారా సేకరించిన సమాచారంతో తాము ఫోన్ చేయబోయే వ్యక్తి .. పర్సనల్ డేటా సాయంతో వారితో మాటలు సాగించేవారు. ప్రభుత్వానికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంది.. లేదంటే జరిమానా, జైలుశిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించేవారు. తమ సమాచారం పక్కాగా చెబుతుండటంతో వారు నిజమైన అధికారులని భ్రమపడి వారు చెప్పిన మొత్తాలను.. చెప్పిన ఖాతాల్లో జమ చేసేవారు.

అలా కొన్ని వందల మిలియన్ డాలర్లు సంపాదించారు. అయితే కొందరు వ్యక్తులకు ఈ విషయంలో అనుమానాలు రావడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుంభకోణం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఈ కుంభకోణంలో మొత్తం 21 మందిని దోషులుగా నిర్థారించి.. వారు చేసిన నేరాలను బట్టి 4 ఏళ్ల నుంచి 20 ఏళ్ల దాకా శిక్ష విధించింది. 

click me!