జార్జియాలో ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లి గుండెపోటుతో ఏపీ విద్యార్థి మృతి.. తీవ్ర విషాదంలో ఫ్యామిలీ..

By Sumanth KanukulaFirst Published Sep 4, 2023, 9:06 AM IST
Highlights

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ ఏపీ యువకుడు అక్కడే మరణించాడు. జార్జియాలోని టీబ్లీసీలో ఎంబీబీఎస్ చదువుతున్న అతడికి గుండెపోటు రావడంతో మృతిచెందాడు.

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ ఏపీ యువకుడు అక్కడే మరణించాడు. జార్జియాలోని టీబ్లీసీలో ఎంబీబీఎస్ చదువుతున్న అతడికి గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీంతో ఏపీలోని ఆ యువకుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పూజారి బండలో నివాసం ఉంటున్న రావూరి శ్రీనివాస్, భాగ్యలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావూరి గిరీష్. శ్రీనివాస్ దంపతులు తమ  కుమారుడిని ఉన్నత  చదువులు చదివించాలని భావించారు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలకు పంపించారు. 

గిరీష్ జార్జియ టీబ్లీసీలోని యూరోపియన్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అయితే శనివారం ఉదయం గిరీష్ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. డాక్టర్ అయి వస్తాడని అనుకున్న కొడుకు ఇలా కన్నుమూయడంతో శ్రీనివాస్, భాగ్యలక్ష్మి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ నెల 20వ తేదీన స్వదేశానికి వచ్చేందుకు గిరీష్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడని.. అయితే ఈలోగా ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని అతని బంధువులు తెలిపారు. 

తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని గిరీష్ కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.‘‘మేము న్యూ ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఒక లేఖ పంపాము. విద్యార్థి మృతదేహాన్ని రాయచోటిలోని అతని స్వగ్రామానికి తిరిగి తీసుకురావడంలో వారి సహాయం కోరాము. గిరీష్ మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం కోసం టీబ్లీసీలోని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడానికి అర్మేనియాలోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించాం’’ అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీష తెలిపారు.

click me!