ఉత్తర ఐర్లాండ్‌లో భారత్‌కు చెందిన ఇద్దరు యువకుల దుర్మరణం..

By Sumanth KanukulaFirst Published Aug 31, 2022, 1:11 PM IST
Highlights

భారత్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉత్తర ఐర్లాండ్‌లో దుర్మరణం చెందారు. సరసులో ఈతకు దిగిన సమయంలో ప్రమాదవశాత్లు వారు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన యువకులను కేరళకు చెందిన జోసెఫ్ సెబాస్టియన్, రూవెన్ సైమన్‌లుగా గుర్తించారు. 

భారత్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉత్తర ఐర్లాండ్‌లో దుర్మరణం చెందారు. సరసులో ఈతకు దిగిన సమయంలో ప్రమాదవశాత్లు వారు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన యువకులను కేరళకు చెందిన జోసెఫ్ సెబాస్టియన్, రూవెన్ సైమన్‌లుగా గుర్తించారు. యూకేలో సెలవుదినం అయిన సోమవారం ఉత్తర ఐర్లాండ్‌లోని డెర్రీ‌లోని ఎనాగ్ లాఫ్‌కు జోసెఫ్ సెబాస్టియన్, రూవెన్ సైమన్‌ స్నేహితులతో కలిసి వెళ్లారు. అక్కడ సరస్సులో ఈతకు దిగిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఉత్తర ఐర్లాండ్‌లోని పోలీస్ సర్వీస్ (పీఎస్ఎన్‌ఐ)  ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇద్దరు యువకుల మృతదేహాలను సరస్సు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించింది.

‘‘ఒక యువకుడిని నీటి నుండి తీసివేసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చనిపోయినట్లుగా నిర్దారించారు. ఫోయిల్ సెర్చ్ , రెస్క్యూ, పోలీసు డైవర్ల ద్వారా విస్తృతమైన శోధనల తర్వాత రెండవ యువకుడి ఆచూకీ లభించింది. అతడిని బయటకు తీశారు. అయితే దురదృష్టవశాత్తు సంఘటన స్థలంలో అతడు చనిపోయినట్లు ప్రకటించబడింది. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతున్నాయి, అయితే ఈ దశలో వారు నీటిలో మునిగి చనిపోయి ఉంటారని మేము నమ్ముతున్నాం. మా ఆలోచనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి’’ అని ఇన్‌స్పెక్టర్ బ్రోగన్ చెప్పారు. 

మరో వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టుగా ఆయన తెలిపారు. అతడికి ప్రాణాపాయం లేదని.. గాయాలు మాత్రం అయ్యాయని చెప్పారు. మరో ముగ్గురు యువకులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక, డెర్రీ మేయర్, స్ట్రాబేన్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ సాండ్రా డఫీ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని సరస్సులు, నదులలో ఈత కొడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

‘‘ఇటువంటి పరిస్థితులలో ఇద్దరు యువకులు ప్రాణాలను కోల్పోవడం మనందరికీ చాలా బాధాకరం. ఒక తల్లిగా.. ఈ సమయంలో నా ఆలోచనలు అబ్బాయిల తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులతో ఉన్నాయి. మీకు బలం, మద్దతు లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరు భారీ నష్టాన్ని అధిగమించాలి’’ అని డఫీ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇక, ఉత్తర ఐర్లాండ్ నగరంలోని కేరళ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం యువకులకు నివాళులు అర్పించారు. ‘‘రూవెన్ సైమన్, జోసెఫ్ సెబాస్టియన్ అనే ఇద్దరు యువకులు నిన్న ఎనాగ్ లాఫ్‌లో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో మేము చాలా హృదయ విదారకంగా ఉన్నాం’’ అని అసోషియేషన్ ప్రతినిధి తెలిపారు. 
 

click me!