జియో సెన్సేషన్: ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్‌లదీ మోసం

By narsimha lodeFirst Published Oct 17, 2019, 1:17 PM IST
Highlights

తొలుత ఉచిత సర్వీసుల హామీతో టెలికం రంగంలో సంచలనం నెలకొల్పిన రిలయన్స్ జియో తాజాగా ఇంటర్ కనెక్ట్ చార్జీల పేరిట నిమిషానికి 6 పైసల చార్జీల వసూలు ప్రారంభించింది. ప్రత్యర్థి సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో జియో వ్యూహం చతికిల పడింది. దీంతో తన ప్రత్యర్థి సంస్థల తీరు వల్ల తనకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని ట్రాయ్ చీఫ్ శర్మకు లేఖ రాసింది. సదరు మూడు సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరింది.

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌లపై రిలయన్స్‌ జియో సంచలన ఆరోపణలు చేసింది. ఇంటర్‌కనెక్ట్‌ రాబడిని అక్రమంగా ఆర్జించేందుకు ఈ సంస్థలు ల్యాండ్‌లైన్‌ నెంబర్లను మొబైల్‌ నెంబర్లుగా చూపాయని రిలయన్స్‌ జియో ఆరోపించింది. ట్రాయ్ ను, టలికం శాఖలను మోసగించాయని పేర్కొంది.

అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఈ టెలికాం కంపెనీలపై భారీ జరిమానా విధించాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌)ని కోరింది. టెలికాం నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌పై భారీ జరిమానా విధించాలని ట్రాయ్‌ చీఫ్‌ ఆర్‌ఎస్‌ శర్మకు ఈనెల 14న రాసిన లేఖలో జియో విజ్ఞప్తి చేసింది.

ఈ మూడు టెలికాం ఆపరేటర్లు పాల్పడిన మోసానికి తమకు రూ వందల కోట్లు, ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిలిల్లిందని పేర్కొంది. ఈ స్కామ్‌ వెలుగుచూసిన క్రమంలో ఆయా కంపెనీలకు తాము చెల్లించిన టెర్మినేషన్‌ ఛార్జీలను రిఫండ్‌ చేసేలా చర్యలు చేపట్టాలని ట్రాయ్‌ను కోరింది.

కాగా జియో ఆరోపణలను ఎయిర్‌టెల్‌ తోసిపుచ్చింది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జ్‌పై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ట్రాయ్‌ను తప్పు దారి పట్టించేందుకు జియో ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. దీనిపై వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ ప్రతిస్పందించలేదు.

click me!