ఇది ఎయిర్‌టెల్ గురూ: రూ.249 ప్రీ పెయిడ్ రీ చార్జీతో రూ.4 లక్షల బీమా

By Siva KodatiFirst Published May 12, 2019, 10:51 AM IST
Highlights

కస్టమర్లను ఆకర్షించడంలో దేశీయ టెలికం సంస్థలు పోటీ పడుతున్నాయి. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలకు ధీటుగా ఎదిగేందుకు భారతీ ఎయిర్ టెల్ ఒక వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 

ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ ఇప్పటివరకు తన కస్టమర్లను కాపాడుకోవడంతోపాటు కొత్త వారిని ఆకర్షించేందుకు వినూత్న ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రధాన ప్రత్యర్థులు రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌కు పోటీగా ఇటీవల పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లను సమీక్షించిన ఎయిర్‌ టెల్‌ తాజాగా మరో కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది.  

ముఖ్యంగా డేటా ప్రయోజనాలతోపాటు భారీ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. రూ.249  ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు రూ.4 ల‌క్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ ఉచితంగా ల‌భిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ గానీ భార‌తీ ఎక్సా సంస్థలు ఆ పాల‌సీకి బాధ్యత వహిస్తాయి. వినియోగదారుల వయసు 18 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి. రూ.249 ప్రీ పెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులకు రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు.

అంతేకాదు  ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం సేవ‌లు, జీ5, లైవ్ చాన‌ల్స్‌, సినిమాలు, ఏడాదిపాటు నార్టన్ మొబైల్ సెక్యూరిటీ సేవ‌లు, వింక్ సభ్యత్వం కూడా ఉచితమే.

రూ.249  రీచార్జి చేసుకున్న వెంట‌నే ప్రీపెయిడ్‌  క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక ఎస్ఎంఎస్ వ‌స్తుంది. అందులో పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా ఇవ్వాలి.. అనే వివ‌రాలు ఉంటాయి. వాటిని న‌మోదు చేసుకున్న వినియోగదారుడు ఫోన్‌లో ఎయిర్‌టెల్ యాప్ నుంచి పాల‌సీ కాపీని పొంద‌వ‌చ్చు.

బీమా సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నుంచి గానీ భార‌తీ ఆక్సా నుంచి ఆ పాల‌సీ జారీ అవుతుంది. దీంతోపాటు రూ.129 కు మ‌రో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశ‌పెట్టింది.

ఈ ప్లాన్‌లో క‌స్టమ‌ర్లకు రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఎయిర్ టెల్ ప్రతిపాదించిన బీమా పాలసీకి రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా ఎలా ప్రతిస్పందిస్తాయో చూడాల్సిందే మరి.
 

click me!