
Uddhav Thackeray VS Devendra Fadnavis : మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నిన్నమొన్నటి వరకు మసీదులపై లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసాతో రాష్ట్ర రాజకీయాలు కాకపుట్టించాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)-శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నాయకులు ఒకరిపైఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే.. రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర పడ్నవీస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని బాబ్రీ లాంటి నిర్మాణంతో పోలుస్తూ.. దానిని కూల్చే వరకు తాను విశ్రమించబోనని అన్నారు. "బాబ్రీ లాంటి మీ శక్తి ప్రభుత్వ నిర్మాణాన్ని కూల్చే వరకు నేను విశ్రమించను" అని ఫడ్నవీస్ అన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పార్టీ మహాసంకల్ప సభలో ఇతర భారతీయ జనతా పార్టీ కలిసి ఆయన హనుమాన్ చాలీసాను పఠించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. “మేము ఇప్పుడే హనుమాన్ చాలీసా జపించాము. బాలాసాహెబ్ థాక్రే తన కుమారుడి హయాంలో హనుమాన్ చాలీసా చదవడం దేశద్రోహమని, ఔరంగజేబు సమాధిని సందర్శించడం రాష్ట్ర మర్యాద అని ఎప్పుడైనా భావించి ఉంటారా? అని ఫడ్నవీస్ అన్నారు. "వారు (శివసేన) నిన్న ఒక ర్యాలీని నిర్వహించారు.. దానిని వారు మాస్టర్ సభ అని పిలిచారు, కానీ మేము వాటిని వింటున్నప్పుడు, అది నవ్వుల సభలా ఉంది... నిన్న ఇది కౌరవ సభ.. నేడు ఇది పాండవ సభ" అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
అలాగే, "అవును, నేను అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నప్పుడు.. నేను అప్పటికే 21 సంవత్సరాల వయస్సులో ఎన్నికైన అతి పిన్న వయస్కుడను.. నా బరువు 128 కిలోలు.. ఇప్పుడు నేను 102 కిలోలు. నేను థాక్రేను హెచ్చరించాలనుకుంటున్నాను.. నా రాజకీయ బరువును తక్కువ అంచనా వేయవద్దు. మహారాష్ట్రలో బాబ్రీ పవర్ స్ట్రక్చర్ను కూల్చివేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ప్రధానమంత్రి సమావేశాలు వినోదం కోసం అని భావించే వారిలో.. బహుశా దేశంలో ఠాక్రే ఏకైక ముఖ్యమంత్రి. ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐపీఎల్ లాగా నడిపించడంలో ఆశ్చర్యం లేదు" అని పేర్కొన్నారు. “గత రెండున్నరేళ్లలో కోవిడ్ కారణంగా లక్షన్నర మందికి పైగా ప్రజలు మరణించినప్పుడు, రైతులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు మరియు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, వలసదారులు నగరాల నుండి తరిమివేయబడ్డారు.. ఆకలితో అలమటిస్తున్నారు. ఠాక్రే తన రాజభవనంలో సంబరాల్లో మునిగిపోయాడు. గత రెండేళ్లలో ఇంటి నుంచి బయటకు రాని ఏకైక సీఎం ఆయనే కావచ్చు అని ఆరోపించారు.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై కూడా పడ్నవీస్ విమర్శలు గుప్పించారు. "అసదుద్దీన్ ఒవైసీ వెళ్లి ఔరంగజేబు సమాధిపై నివాళులు అర్పించారు.. మీరు దానిని చూస్తూనే ఉంటారు, దానికి మీరు సిగ్గుపడాలి" అని అన్నారు.