
రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని ఓ మహిళ కట్టుకున్న భర్తపై కక్ష పెంచుకుంది. ఈ క్రమంలోనే కోపంతో.. వేడి వేడి నూనె తీసుకెవళ్లి భర్త ముఖంపై పోసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
సాగర్ జిల్లాకు చెందిన శివకుమారి అహివార్ అనే మహిళకు అరవింద్ అహివార్ అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. రోజూ వారి కూలీ పని చేసుకునే అరవింద్ ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో భార్యతో గొడవలయ్యేవి. పెద్దలు కల్పించుకుని ఇద్దరికీ సర్ధిచెప్పారు. అలా చాలా రోజులు గొడవలు పడకుండా ఉన్నారు.
అయితే సోమవారం ఉదయం ఐదు గంటంల ప్రాంతంలో అరవింద్ నిద్రలో ఉండగా శివకుమారి అతడి ముఖంపై వేడివేడి నూనె పోసింది. అతడి అరుపులు విని అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతడి ముఖంపై తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తేల్చారు. ఈ దారుణానికి కారణమైన నిందితురాలు ఎక్కడికీ పారిపోకుండా.. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేయటం గమనార్హం. ఆమెపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.