
దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే మూడు, నాలుగు రోజుల పాటు తేలికపాటి జల్లులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కె జెనామణి తెలిపారు. అయితే ఈసారి ఢిల్లీ వర్షాలపై వాతావరణ శాఖ అంచనాలు తప్పడంపై స్పందించిన ఆయన.. స్థానికంగా కురిసే వర్షపాతాన్ని అంచనా వేయడంలో 100 శాతం ఖచ్చితత్వం ఏ దేశానికైనా కష్టమనే విషయమనే చెప్పారు. ఢిల్లీ వర్షాల ఖచ్చితత్వం 80 శాతం ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఢిల్లీలో తేమ కొనసాగుతుందని.. అయితే రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని ఆర్కె జెనామణి చెప్పారు. జూలై 12, 13 తేదీల్లో ఢిల్లీలో తేలికపాటి జల్లులు కురుస్తాయని అంచనా వేయబడిందని తెలిపారు. అయితే తీవ్రతపై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఢిల్లీలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆయన చెప్పారు. అయితే కొంతమంది ఊహించినట్లుగా ప్రతికూలంగా ఉండదని స్పష్టం చేశారు.
‘‘ఢిల్లీలో తీవ్రమైన వేడి ఉంది. తేమ వనరులు పరిమితంగా ఉన్నాయి. ఇది సముద్ర తీరానికి చాలా దూరంగా ఉంది. అందుకే ఇక్కడ వర్షాలు కురవడం అనేది చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ, మథుర, ఆగ్రా, హర్యానాలలో.. మేఘాలు ఉన్న సమయంలో వర్షాలు కురుస్తాయో లేదో నిర్ధారించడం ఒక సవాలు’’ అని పేర్కొన్నారు. పట్టణీకరణ వంటి స్థానిక కారకాలు కూడా వర్షాలపై ప్రభావం చూపుతాయని చెప్పారు.
ఆయన్ ఆంగ్ల మీడియా సంస్థ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్లలో ఐఎండీ అంచనా ఖచ్చితత్వం 30 శాతానికి పైగా మెరుగుపడింది. అయితే ఇది ఇప్పటికీ చాలా లోటుపాట్లను కలిగి ఉంది.. అందుకే సూచన ఇంకా 100 శాతం ఖచ్చితమైనది కాదు’’ అని చెప్పారు.
తప్పుడు అంచనాలను తగ్గించే దిశగా ఐఎండీ పనిచేస్తోందని చెప్పారు. ఇందుకోసం అధిక resolutionతో కూడిన వాతావరణ రాడార్లను ఏర్పాటు చేయడం ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఇది పరిశీలనా వ్యవస్థల సంఖ్యను కూడా పెంచుతోందన్నారు. అలాగే లోపాలను తగ్గించడానికి వారి సూచన మోడలింగ్ వ్యవస్థలను మార్చే దిశగా పని చేస్తోందని తెలిపారు.
ఇక, రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాల ద్రోణి ఉత్తరం వైపు కదులుతుందని తాము ఆశిస్తున్నట్టుగా చెప్పారు. ఇది ఢిల్లీకి దక్షిణంగా ఉందని.. అందుకే అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. రుతుపవనాల రాక వల్ల ప్రతిరోజూ భారీ వర్షాలు కురుస్తాయని కూడా జెనామణి సూచించారు. ఢిల్లీ తీర ప్రాంతం కాదని.. అందుకే ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు ఆశించవద్దని చెప్పారు.
ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్లలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆయన చెప్పారు. ఇక, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్ వంటి పశ్చిమ రాష్ట్రాలు లోటు వర్షపాతం స్థాయిలు పొందుతాయని ఆయన తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేయబడిన గుజరాత్, ముంబై, విదర్భ, తెలంగాణ వంటి ప్రాంతాలను మీడియా హైలైట్ చేయాలని కూడా చెప్పారు. ఢిల్లీ ఒక్క ప్రాంతంపైనే దృష్టి పెట్టకూడదని అన్నారు.