కొనసాగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. ఓటు వేసిన ప్రధాని మోదీ.. ఈరోజే వెలువడనున్న ఫలితం..

By Sumanth KanukulaFirst Published Aug 6, 2022, 10:35 AM IST
Highlights

భారత 16వ ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది. పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌బి త‌ర‌ఫున ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధన్‌కర్ బ‌రిలో ఉన్నారు.

భారత 16వ ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది. పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌బి త‌ర‌ఫున ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధన్‌కర్ బ‌రిలో ఉన్నారు. విప‌క్షాల త‌ర‌ఫున సీనియ‌ర్ పొలిటిక‌ల్ నాయ‌కులు మార్గ‌రేట్ అల్వా పోటీ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అశ్విని వైష్ణవ్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

పోలింగ్ పూర్తైన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ రోజు రాత్రి ఉప రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. ఇక, ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల 10తో ముగియనున్న సంగతి తెలిసిందే. నేడు ఎన్నికైన కొత్త ఉప రాష్ట్రపతి ఈ నెల 11న ప్రమాణ స్వీకారంం చేయనున్నారు. 

దేశ ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ కోసం ఎలక్టోరల్ కాలేజీ 780 ఓట్లను కలిగి ఉంది. ఇందులో 543 ఎన్నికైన లోక్‌సభ ఎంపీలు, 245 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే ప్రస్తుతం రాజ్యసభలో 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 780గా ఉంది. అయితే ఈ ఎన్నికలో జగదీప్ ధన్‌కర్ విజయం లాంచనమేనని తెలుస్తోంది. ఏన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీకి ఒంటరిగానే ఉభయ సభలలో 394 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో లోక్‌సభలో 303 మంది ఎంపీలు, రాజ్యసభలో 91 మంది ఎంపీలు ఉన్నారు. సగం మార్కు 391 కంటే ఎక్కువ. అంతేకాకుండా ధన్‌కర్‌కు ఎన్డీయే కూటమి కాకుండా, పలు పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు 525 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే 70 శాతం ఓట్లు ఆయనకు దక్కే అవకాశం ఉంది. 

టీఎంసీ దూరం.. 
ఈ ఎన్నికకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ దూరంగా ఉండనున్నట్టుగా ప్రకటించింది. దీంతో ఉభయసభలలో ఆ పార్టీకి చెందిన 36 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నారు. 
 

click me!