
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ను కీర్తిస్తూ నినాదాలు చేస్తున్నవారిపై కేంద్ర మంత్రి అశ్విని చౌబే మండిపడ్డారు. అతీక్ అహ్మద్ను కీర్తిస్తూ నినాదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అశ్విని చౌబే.. అలాంటి వారిని కనిపించిన వెంటనే కాల్చివేయాలని అన్నారు. బిహార్లోని పాట్నా జిల్లాలో శుక్రవారం ప్రార్థనా సంఘం వద్ద ఒక వ్యక్తి అతీక్కు మద్దతుగా, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంఘటనపై చౌబే ఈ విధంగా స్పందించారు.
‘‘జుమ్మా నమాజ్ చేసిన తర్వాత వారిలో ఒకరు 'అతిక్ అహ్మద్ అమర్ రహే' అని అరిచాడు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేసాడు’’ అని పాట్నా సిటీ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు. ఈ నివేదికపై అశ్విని చౌబే స్పందించారు. ‘‘ఈ సంఘటన విచారకరం. బీహార్లో ఇటువంటి ప్రకటనలు, నినాదాలు చేయడం దురదృష్టకరం. అలాంటి వారిని వెంటనే కాల్చివేయాలి’’ అని అశ్విని చౌబే అన్నారు.
యోడి ఆదిత్యనాథ్, మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై అశ్విని చౌబే స్పందిస్తూ.. ‘‘దేశ ప్రధానికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పేర్లు పెట్టుకుని నినాదాలు చేసిన తీరు కూడా చాలా దురదృష్టకరం’’ అని అన్నారు. అదే సమయంలో బిహార్ ప్రభుత్వంపై అశ్విని చౌబే విమర్శలు గుప్పించారు. టెర్రరిజం, మాఫియా వంటి నేరస్థులను విడిచిపెట్టని ‘యోగి’ మోడల్ బీహార్లో మనకు అవసరం అని అన్నారు.
బీహార్లో కేవలం మామ-మేనల్లుడి వంశం, కులవివక్ష ప్రభుత్వం నడుస్తోందని అశ్విని చౌబే విమర్శించారు. బీజేపీని టార్గెట్ చేస్తూ సీఎం నితీశ్ కుమార్ ప్రకటనలు ఇస్తున్నారని.. 2025లో రాష్ట్రంలో యోగి మోడల్ను ఎంచుకుని ప్రజలే వారికి సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో బీహార్ ప్రజలు యోగి మోడల్ను అధికారంలోకి తీసుకువస్తారని.. బీహార్లో కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.