
విద్యార్ధులకు విద్యా, బుద్ధులు నేర్పిస్తూ వారిని భావి భారత ప్రజలుగా తీర్చిదిద్దాల్సిన గురువులు ఈ మధ్యకాలంలో తమ వృత్తికే కళంకం తీసుకొస్తున్నారు. పిల్లలను దారిలో పెడతారని స్కూల్కు పంపిస్తే వారిని గొడ్డుని బాదినట్లు బాదుతున్నారు. తాజాగా టాయిలెట్ కు వెళ్లిందని ఓ విద్యార్ధినిని టీచర్లు చితకబాదారు. వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో .. అదేమన్నా నేరమా? స్కూల్కు వచ్చినవారు మంచినీళ్లు తాగటం.. టాయిలెట్కు వెళ్లటం చేయటం ఘోరమా? విద్యార్ధుల పట్ల ఇలాగేనా వ్యవహరించేది? అని చీవాట్లు పెట్టడంతో పాటు ఘటనకు బాధ్యులైన సదరు టీచర్లకు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు గుజరాత్ రాష్ట్రం (gujarat) మిర్జాపూర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే.. అహ్మాదాబాద్లోని (ahmedabad) మకర్భా అర్జున్ ప్రాథమిక స్కూల్లో (makarba arjun school) ఐదేళ్ల విద్యార్ధిని చదువుతోంది. ఓ రోజు ఇంటికి వెళ్లి తర్వాత ఆ చిన్నారి తనను టీచర్లు కాళ్లపై తీవ్రంగా కొట్టారని.. గెంటేశారంటూ ఏడుస్తూ తల్లితో చెప్పింది. టీచర్ కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి కాళ్లపై వాతలు తేలాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె సర్ఖేజ్ పోలీస్ స్టేషన్లో జూన్ 22, 2017న ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీచర్లు తరుణ పర్బతియా (36), నజ్మా షేక్ (47)పై కేసు నమోదు చేశారు. దీనిపై మిర్జాపూర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు విచారణ జరిపింది.
దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత వేర్వేరు సెక్షన్ల కింద టీచర్లు ఇద్దరికీ మూడేళ్ల జైలు శిక్ష రూ.10,000 జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. అంతేకాదు టీచర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించింది. విచారణ సందర్భంగా.. నీళ్లు తాగేందుకు వెళ్లాలని, టాయిలెట్ అని, బ్రేక్ ఫాస్ట్ కోసమని పాఠాలు వినకుండా ఇలా పదే పదే బయటకు వెళ్లటానికి పాప పర్మిషన్ అడుగుతోందని టీచర్లు కోర్టుకు చెప్పారు. అందువల్ల భయం చెప్పటానికే తాము కొట్టామని తెలిపారు. అయితే కోర్టు మాత్రం టీచర్లకు చీవాట్లు పెట్టింది. స్కూల్లో మంచినీళ్లు తాగటం..టాయిలెట్ కు వెళ్లటం నేరమా? .. అంతమాత్రానికే దారుణంగా కొడతారా? అంటూ చీవాట్లు పెట్టింది.