
దేశంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమ ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఆ అమ్మాయి ప్రాణాలను తీసేందుకు సైతం ప్రేమోన్మాదులు వెనుకాడటం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ లిస్టులో బాధితులుగా వున్నారు.
తాజాగా ముంబైలో టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై హత్యాయత్నం జరిగింది. మాల్వీ మిత్రుడే ఆమెపై కత్తితో దాడి చేయగా, ఆమె చేతులకు, పొత్తి కడుపులో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ ఘటనకు పాల్పడింది యోగేష్ కుమార్ మహీపాల్ సింగ్గా గుర్తించారు. ఏడాది నుంచి తమ ఇద్దరికీ పరిచయం ఉందని, తాము ఫ్రెండ్స్గానే ఉంటూ వస్తున్నామని మాల్వీ పోలీసులకు తెలిపింది.
అయితే తనను పెళ్లి చేసుకోవాలని యోగేష్ కొంత కాలంగా ఒత్తిడి తీసుకురావడంతో తాను తిరస్కరించానని, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యోగేశ్ తనపై దాడికి పాల్పడ్డాడని తెలిపింది.
సోమవారం రాత్రి 9 గంటలకు నార్త్ ముంబైలోని వెర్పోవా ప్రాంతంలోని ఒక కేఫ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మాల్వీని యోగేష్ అడ్డగించి పెళ్లి ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది.
ఎప్పటిలాగే ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో పొడిచి పారిపోయాడని తెలుస్తోంది. పరారీలో ఉన్న యోగేష్ను త్వరలో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మాల్వీ ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే యోగేష్.. మాల్వీకి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. యోగేష్ తనకు తాను నిర్మాత అని చెప్పుకుని మాల్వీని పరిచయం చేసుకున్నాడు. ఇది వరకు ఒకసారి మాత్రమే ఆమె యోగేష్ను కలిసినట్లు తమ దర్యాప్తులో తెలిందని పోలీసులు వెల్లడించారు.