తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

04:49 PM (IST) Jul 21
తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం... భారత మాతకు ప్రతిరూపమైన సోనియాగాంధీ కి ఈడీ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసులివ్వడం కక్ష సాధింపు చర్యేనని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం సోనియాగాంధీ కి అండగా నిలబడిందని రేవంత్ పేర్కొన్నారు.
04:34 PM (IST) Jul 21
ఒడిషాలో రానున్న మూడురోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భువనేశ్వర్ లోని వాతావరణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా బోధ్, బోలంగిర్, గజపతి, గంజాం, కందమల్, కలహండి జిల్లాల్లో ఇవాళ అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
04:23 PM (IST) Jul 21
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయహోదా కల్పించాలని కోరారని... కానీ కాళేశ్వరాని ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ లేకపోవడంతో జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తెలిపింది.
03:33 PM (IST) Jul 21
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
03:17 PM (IST) Jul 21
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణకు హాజరయ్యారు. రెండుగంటల పాటు సోనియాను ఈడి అధికారులు విచారించారు. ఇటీవలే కరోనాబారిన కోటుకుంటున్నానని... ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో తొందరగా పంపించాలని కోరగా ఈడి అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది.
03:04 PM (IST) Jul 21
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డిఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యం సాధించారు. మొత్తం 748 ఎంపీల ఓట్లు పోలవగా అందులో 540 ఓట్లు ముర్ముకే వచ్చారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కు కేవలం 208 ఓట్లు మాత్రమే వచ్చాయని... మరో 15 ఓట్లు చెల్లకుండా పోయాయని అధికారులు వెల్లడించారు.
02:28 PM (IST) Jul 21
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో ర్యాకింగ్ లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ ర్యాకింగ్స్ లో కర్ణాటక మొదటి స్థానంలో, హర్యానా మూడో స్థానంలో నిలిచింది.
01:30 PM (IST) Jul 21
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ మెల్లిగా విజృంభిస్తోంది. గత 24గంటల్లో 21,566 కొత్తకేసులు నమోదవగా 45మంది మృత్యువాతపడ్డారు. 152 రోజుల తర్వాత దేశంలో నమోదయిన అత్యధిక కేసులు ఇవే. తాజా కేసులతో కలిపితే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,881కి చేరింది.
01:22 PM (IST) Jul 21
భారత రాష్ట్రపతి ఎన్నిక కోసం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రెండురోజుల క్రితం పార్లమెంట్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో పోలింగ్ ముగిసింది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ (గురువారం) కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా బ్యాలెట్ పేపర్లను కట్టలుగా ఒకదగ్గర కట్టడం పూర్తయినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేల వేసిన ఓట్ల లెక్కింపు పూర్తయితే భారత రాష్ట్రపతి ఎవరన్నదీ తేలనుంది.
12:48 PM (IST) Jul 21
పార్లమెంట్ సమావేశాల్లో ధరల పెంపు, జీఎస్టీ పై ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై చర్చించాలని టీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు లోక్ సభలో పట్టుబట్టారు. కానీ స్పీకర్ అందుకు అనుమతించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ సభ నుండి టీఆర్ఎస్, డీఎంకే, బీఎస్పీ, టీఎంసీ, ఎస్పీ ఎంపీలు వాకౌట్ చేసారు.
12:07 PM (IST) Jul 21
డిల్లీలోని ఏఐసిసి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఏఐసిసి కార్యాలయం నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీకి సిద్దమయ్యారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మద్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
11:39 AM (IST) Jul 21
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ కూడా ఆందోళనకు సిద్దమయ్యింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఇతర నాయకులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు. ఈ ర్యాలీకి పోలీసులు నిబంధనలతో కూడిన అనుమతులిచ్చారు.
11:21 AM (IST) Jul 21
నూతన రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇటీవల దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగ్గా ఇవాళ దేశ అత్యున్నత పదవి ఎవరికి దక్కనుందో తేలనుంది. ఇప్పటికే పార్లమెంట్ హౌస్ లోని 63వ నంబర్ గదిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఎన్డిఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి పదవికోసం పోటీపడ్డారు.
10:44 AM (IST) Jul 21
నేషనల్ హెరాల్డ్ కేసులో మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఈడీ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్దమయ్యింది. డిల్లీలోని ఏఐసిసి కార్యాలయం వద్ద ఇప్పటికే భారీగా నాయకులు, కార్యకర్తలు గుమిగూడారు. అక్కడినుండి ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్దమవగా అందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఏఐసిసి కార్యాలయం వద్ద బారీకేడ్లు ఏర్పాటుచేసి భారీగా పోలీసులు మోహరించారు.
10:32 AM (IST) Jul 21
ఆర్థిక సంక్షోభంతో దేశంలో పరిస్థితి అధ్వాన్నంగా, అల్లకల్లోలంగా వున్న సమయంలో శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. గత అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూసి విదేశాలకు పరారవడంతో ఆపత్కాలంలో వున్న శ్రీలంకకు అధ్యక్షుడిగా రణిల్ నియమితులయ్యాయి. తాజాగా రాజధాని కొలంబోలో ఆయన ప్రమాణస్వీకారం చేసారు. శ్రీలంక చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య పార్లమెంట్ లో 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘే చేత ప్రమాణం చేయించారు.
09:58 AM (IST) Jul 21
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు, విచారణ పేరిట వేధించడం తగదంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నారు. ఇవాళ (గురువారం) సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యలో పార్లమెంట్ లో ఈ అంశంపై చర్చించాలంటూ ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీల నాయకులకు వేధించడానికే ప్రభుత్వం ఈడీ (ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్)ను ఉపయోగించుకుంటోందని ఎంపి మాణిక్కం ఠాగూర్.... దీనిపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ కోరారు.
09:32 AM (IST) Jul 21
నేడు వెలువడనున్న రాష్ట్రపతి ఎన్నికల పలితాల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు ముందుగానే తేల్చేసారు. దీంతో ఫలితాల విడుదలకు ముందే ముర్ము స్వరాష్ట్రం ఒడిషాలో సంబరాలకు సిద్దమయ్యారు. ముర్ము రాష్ట్రపతి పదవిని అధిరోహించడం కేవలం గిరిజనులకే కాదు ఒడిషా, భారత్ కే గర్వకారణమని ఆమె సోదరుడు తరినిసేన్ తుడు పేర్కొన్నారు.
09:18 AM (IST) Jul 21
భారతదేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి ఎవరికి దక్కనుందో నేడు తేలిపోనుంది. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు (21వ తేదీ గురువారం) వెలువడనున్నాయి. ఎన్టీఆర్ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాలో ఎవరు భారత రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించనున్నారో తేలిపోతుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.