తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

09:46 PM (IST) Sep 08
ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో భారత్ 132వ స్థానంలో నిలిచింది. మొత్తం 191 దేశాలున్న ఈ జాబితాలో వుంటాయి. 2020లో మనదేశం ఈ సూచీలో 130వ స్థానంలో వుండగా.. ఇప్పుడు రెండు స్థానాలు దిగజారింది
09:14 PM (IST) Sep 08
కొన్నాళ్లుగా ఫాం లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి గాడిలో పడ్డాడు. ఆసియా కప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించాడు. టీ20లలో తొలి సెంచరీ నమోదు చేశాడు. 122 పరుగులతో అజేయంగా నిలిచాడు.
08:34 PM (IST) Sep 08
భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఆవిష్కరించారు. నేతాజీ విగ్రహాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ రాయిని వినియోగించారు. అలాగే చారిత్రక రాజ్పథ్ను కర్తవ్యపథ్గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
07:45 PM (IST) Sep 08
అమరావతిని మున్సిపాలిటిని చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ కు పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా సమాధానం ఇవ్వకుంటే అమరావతి మున్సిపాలిటీకి ఆమోదం తెలిపినట్లుగానే పరిగణిస్తామన్నారు.
07:20 PM (IST) Sep 08
నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ వెంకటదాస్పై హత్యాయత్నం జరిగింది. ముఖంపై సాంబారు పోసి గొంతునొక్కి హత్య చేసేందుకు దుండగులు యత్నించారు. అయితే దుండగుల నుంచి తప్పించుకున్నారు వెంకటదాస్. ఇటీవల నంద్యాల మున్సిపాలిటీలో పలువురి సస్పెన్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సస్పెన్షన్ వ్యవహారమే హత్యాయత్నానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
06:34 PM (IST) Sep 08
హైదరాబాద్లోని చర్లపల్లి వద్ద స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలవ్వగా మరో నలుగురి పరిస్ధితి విషమంగా వుంది. మృతులు నారాయణ, శ్రీచైతన్య, రవీంద్ర భారతి స్కూల్ విద్యార్ధులుగా తెలుస్తోంది. వీరంతా ఈసీఐఎల్ నుంచి చర్లపల్లి వైపు వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
05:38 PM (IST) Sep 08
హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబుర్జు ఆసుపత్రిలో మరణించిన మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోలేదన్నారు తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి. ఆ మహిళ జ్వరం వల్లే ప్రాణాలు కోల్పోయిందని డీఎంఈ తెలిపారు. మహిళకు ట్యూబెక్టమీ చేయలేదని.. సిజేరియన్ జరిగిందని రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. మహిళకు ఆపరేషన్ జరిగిన రోజే మరో 9 మందికి సర్జరీ జరిగిందని ఆయన పేర్కొన్నారు.
03:36 PM (IST) Sep 08
వినాయక నిమజ్జనానికి రెడీ అవుతున్న హైదరాబాద్ వాసులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు రేపు (సెప్టెంబర్ 9) న సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.
02:18 PM (IST) Sep 08
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. దీంతో వాహనదారులు, రోడ్డుపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
01:41 PM (IST) Sep 08
విజయవాడలోని పడమట పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ టీడీపీ కార్యాలయం నుంచి నల్ల బ్యాడ్జీలతో ర్యాలీగా చేరుకున్న నాయకులు పీఎస్ ను చుట్టుముట్టారు. చెన్నుపాటి గాంధీ కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ కాపీలు, వైద్యుల నివేదికలతో టీడీపీ నాయకులు ఆందోళకు దిగారు.
12:59 PM (IST) Sep 08
భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో ఐదవ స్థానంలో నిలవడం సాధారణ విషయం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇదే ఊపును కొనసాగిస్తూ దేశాన్ని మరింత అభివృద్ది పథంలో నడిపిస్తామని మోదీ పేర్కొన్నారు.
12:19 PM (IST) Sep 08
ఇటీవల లోన్ యాప్ ఆగడాలు అనేకం వెలుగుచూసిన నేపథ్యలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బిఐ అనుమతి పొందిన లోన్ యాప్స్ కు మాత్రమే అనుమతివ్వాలని... ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జగన్ సర్కార్ ఆదేశించింది.
11:03 AM (IST) Sep 08
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య పదివేల దిగువకు చేరుకున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,395 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా కొత్త కేసుల కంటే రికవరీ అయినవారి సంఖ్యే (6,614) ఎక్కువగా వుండటం ఊరటనిచ్చే అంశం. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 4,44,78,636 కు చేరుకోగా రికవరీ సంఖ్య 4,39,00,204కు చేరాయి.
10:29 AM (IST) Sep 08
అగ్రరాజ్యం అమెరికాలో మితిమీరిన గన్ కల్చర్ కు మరో ఇద్దరు అమాయకులు బలయ్యారు. టెన్నెస్సి మెంపిన్ లో 19 ఏళ్ల యువకుడు గన్ తో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
09:38 AM (IST) Sep 08
తెలుగు రాష్ట్రాల్లో రాగల 24గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రుతుపవనాలు చురుగ్గా మారాయని... దీంతో గత రెండుమూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఇవి మరింత జోరందుకుని తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది.
09:28 AM (IST) Sep 08
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు ఎన్నికయ్యారు.