
రాష్ట్రంలో ఇక నుంచి ఐదేళ్లలోపు పిల్లలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు (free travel) అనుమతిస్తున్నట్లు తమిళనాడు (tamil nadu transport minister sivasankar) రవాణా శాఖ మంత్రి శివశంకర్ ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం ఉదయం రవాణా శాఖ పద్దు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శివశంకర్ కొత్త రాయితీలు ప్రకటించారు. రాయితీతో కూడిన సీజన్ టిక్కెట్లు ఇకపై ఆన్లైన్ ద్వారా పొందవచ్చని మంత్రి వెల్లడించారు. చెన్నై, తిరుచ్చి, విల్లుపురం రవాణా మండలాల్లోని బస్ డిపోల స్థాయి పెంచి ఆధునికీకరణ చేయనున్నట్లు శివశంకర్ పేర్కొన్నారు.
ఈ డిపోల్లో బస్సులు శుభ్రం చేసేందుకు ఆటోమేటిక్ విధానాన్ని అమలుచేస్తామని మంత్రి చెప్పారు. ఈ సౌకర్యం లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ డిపోల్లో ప్రభుత్వ శాఖల వాహనాలకు మరమ్మతు నిర్వహించేలా ఆధునిక మొబైల్ డిపోలను రూపొందించనున్నట్లు శివశంకర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రవాణా సంస్థలన్నింటినీ సమైక్యపరచి ప్రయాణికుల సౌకర్యార్ధం సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నామని మంత్రి చెప్పారు.
అంతకుముందు తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ (mk stalin) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిణులకు వారి ఉన్నత విద్యను అభ్యసించేందుకు నెలకు రూ.1000 ప్రోత్సాహకంగా అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి, వారికి సహాయం చేయడానికి నెలవారీగా డబ్బు డిపాజిట్ చేయనుంది. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన బాలికల బ్యాంకు ఖాతాల్లో రూ.1000 జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ పథకం ద్వారా సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
ఈ పథకం కోసం మొత్తం రూ.698 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యలో ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాన్ని పెంచడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ‘‘మూవలూరు రామామృతం అమ్మాయార్ స్మారక వివాహ సహాయ పథకం ’’ అని గతంలో పిలిచే పథకాన్ని మారుస్తున్నట్టు తమిళనాడు ఆర్థిక మంత్రి రాజన్ తెలిపారు. ఇప్పుడు దీనిని ‘‘ మూవలూరు రామామృతం అమ్మాయార్ ఉన్నత విద్యా భరోసా పథకం ’’ పిలుస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 12 తరగతుల బాలికలందరికీ వారి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, ITI కోర్సులు నిరంతరాయంగా పూర్తయ్యే వరకు వారి బ్యాంకు ఖాతాలలో నెలకు వెయ్యి రూపాయిలు జమ అవుతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కాలర్ షిప్ లతో పాటు ఈ పథకం ద్వారా కూడా విద్యార్థులు లబ్దిపొందుతారు అని మంత్రి తెలిపారు. EVR మణిఅమ్మయ్యర్ స్మారక వితంతు కుమార్తె వివాహ సహాయ పథకం, డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి స్మారక కులాంతర వివాహ సహాయ పథకం, అన్నై తెరాస అనాథ బాలికల వివాహ సహాయ పథకం, డాక్టర్ ధర్మాంబళ్ అమ్మయ్యర్ స్మారక వితంతువు స్మారక వితంతువుల సహాయ పథకం వంటి పథకాలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. వీటిలో పలు మార్పులు అమలు చేస్తామని చెప్పారు.