
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ స్కూల్లో నాలుగేళ్ల బాలికపై అక్కడే ప్యూన్గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఇందుకు సంబంధించి బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. ఢిల్లీ రోహిణిలోని ఓ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలిక తల్లి బుధవారం దక్షిణ రోహిణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఒక వ్యక్తి తన కుమార్తెను వేధించాడని ఫిర్యాదులో ఆరోపించింది. ఒక రోజు క్రితం ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా చెప్పింది.
బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా.. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354Bతో పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మే 1వ తేదీన బాలికను పాఠశాలలో చేర్చారని చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా నిందితుడైన వ్యక్తికి మీసాలు ఉన్నాయనే ఒక క్లూ మాత్రమే తమకు లభించిందని తెలిపారు. ఆసుపత్రిలో చిన్నారికి వైద్యపరీక్షలు నిర్వహించి.. కౌన్సెలింగ్ నిర్వహించినట్టుగా చెప్పారు.
అయితే గురువారం ఉదయం చిన్నారి నిందితుడిని గుర్తించిందని పోలీసులు తెలిపారు. నిందితుడు సుల్తాన్పురికి చెందిన సునీల్కుమార్(43) అని.. అతడు పాఠశాలలో ప్యూన్గా పనిచేస్తున్నాడని చెప్పారు. అతడిని అరెస్ట్ చేయడం జరిగిందని వెల్లడించారు.