
ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాబూల్ నుండి న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన 16 మంది నిర్వాసితులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో చిక్కుకొన్న 78 మందిని ఎయిరిండియా విమానంలో కాబూల్ నుండి ఇండియాకు తీసుకొచ్చారు.
ఢిల్లీకి చేరిన 78 మందిలో 16 మందికి కరోనా సోకిందని వైద్యలు తేల్చారు. కాబూల్ నుండి వచ్చిన 78 మందిని క్వారంటైన్ చేశారు. కాబూల్ నుంచి వచ్చిన వారిలో 25 మంది భారతీయులు మిగిలిన వారు అఫ్ఘాన్ సిక్కు, హిందూ కుటుంబాలకు చెందినవారు కూడా ఉన్నారు. కాబుల్లోని గురుద్వారా నుంచి గురు గ్రంథ సాహిబ్కు చెందిన మూడు ప్రతులను ఢిల్లీకి తీసుకు వచ్చి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్పురికి అప్పగించారు.
గతంలో అప్ఘానిస్థాన్ నుంచి వచ్చిన 146 మందిలో ఇద్దరికి కరోనా సోకింది.కరోనా సోకిన వారిలో ముగ్గురు సిక్కులున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి కరోనా సోకిన సిక్కులకు స్వాగతం పలికారు.
ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకొన్న తర్వాత ఆ దేశంలో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆ దేశాన్ని వీడుతున్నారు. అక్కడే ఉన్న భారతీయులను రప్పించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకొంటుంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన వారిలో కొందరికి కరోనా సోకింది.