పాముతో కరిపించి భార్య హత్య. ధోషిగా తేలిన భర్త..!

By telugu news teamFirst Published Oct 12, 2021, 9:33 AM IST
Highlights

 గత ఏడాది మే 6న ఉత్రాతో నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ తాగించిన సూరజ్.. ఆమె నిద్రపోయిన తర్వాత పామును వదిలి కరిపించాడు. పాముతో రెండుసార్లు బలవంతంగా కాటు వేయించడంతో ఆమె మృతిచెందింది. 

మరో అమ్మాయితో పెళ్లి కోసం ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను పథకం ప్రకారం హత్య చేయించాడు.  ప్లాన్ ప్రకారం పాముతో కాటు వేయించి భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. ఈ ఘటనలో భర్తను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళలోని  కొల్లం జిల్లాలోని అంచల్‌ పట్టణానికి చెందిన ఉత్రా (25), సూరజ్‌ (32) భార్యాభర్తలు. వివాహమైన తర్వాత వీరి కాపురం కొద్ది రోజులు సజావుగా సాగింది. అయితే, సూరజ్‌ మరో అమ్మాయిని వివాహం చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా భార్యను పాముతో కాటు వేయించి చంపాలని పథకం వేశాడు. పాములు పట్టే ఓ వ్యక్తిని సంప్రదించి కొత్త డబ్బులిచ్చి నాగుపామును తీసుకున్నాడు.

 ఈ క్రమంలో గత ఏడాది మే 6న ఉత్రాతో నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ తాగించిన సూరజ్.. ఆమె నిద్రపోయిన తర్వాత పామును వదిలి కరిపించాడు. పాముతో రెండుసార్లు బలవంతంగా కాటు వేయించడంతో ఆమె మృతిచెందింది. గతంలో కూడా ఉత్రా పాముకాటుకు గురికావడంతో.. కుమార్తె మృతిపై అనుమానంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదనపు కట్నం కోసం తమ కుమార్తెను గతంలో వేధించిన విషయాన్ని తెలియజేశారు. దీంతో సూరజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించి అసలు నిజాన్ని బయటపెట్టారు. ప్రత్యక్ష సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయినా శాస్త్ర, సాంకేతికత సాయంతో మర్డర్ మిస్టరీని పోలీసులు నిరూపించడం విశేషం. పదిహేడు నెలల్లోనే విచారణ పూర్తిచేసి, నిందితుడ్ని దోషిగా నిరూపించారు.

‘సాధారణంగా పాము కాటు వేసేటప్పుడు గాయం 1.7 నుంచి 1.8 సెం.మీ. ఉంటుంది... కానీ, హతురాలు ఉత్రా శరీరంపై 2.3 నుంచి 2.8 సెం.మీ. వరకు ఉంది.. పాముతో బలవంతంగా కాటు వేయించినప్పుడే ఇలా జరుగుతుంది’అని పోలీస్ అధికారి తెలిపారు. ఆమెను కరిచిన తర్వాత పాము కూడా చనిపోయిందని, దానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా వారం రోజుల నుంచి ఎటువంటి ఆహారం లేకపోవడంతో మరింత కోపంతో కాటువేసిందని గుర్తించినట్టు వెల్లడించారు. ఉత్రా శరీరంలో నిద్రమాత్రల అవశేషాలను గుర్తించామన్నారు.
  

click me!