
అది ఓ ప్రభుత్వ పాఠశాల. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి భావి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన మహిళ టీచర్లు విచక్షణ కోల్పోయారు. నీళ్ల కుళాయి( నల్లాల) వద్ద పంచాయితీలాగా.. కుమ్ములాడుకున్నారు. కనీసం విద్యార్దులు చూస్తున్నారనే ఇంగీతం కూడా మరిచారు. వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. ఎన్నో రోజులుగా లోలోన రగులుతున్న కోపం ఒక్కసారిగా రచ్చకెక్కడంతో.. వివాదం విద్యాశాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. వీళ్లు అసలు టీచర్లేనా.. అనే ప్రశ్నించే స్థాయికి చేరింది ఈ వివాదం. ఇది తెలిసిన ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వివరణ కోరారు.
వివరాలిలా ఉన్నాయి. పాట్నాలోని బిహ్తా బ్లాక్ కౌరియా పంచాయతీలోని పాఠశాలలో కాంతి కుమారి ఇన్ఛార్జ్ హెడ్మాస్టర్గా పనిచేస్తుండగా.. అదే పాఠశాలలో అనితా కుమారి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య ఏదో విషయమై వివాదం నడుస్తోంది. దీనిపై గురువారం ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ విషయం ఎంత వేడెక్కిందంటే, కొద్దిసేపటికే టీచర్లిద్దరూ ఒకరితో ఒకరు కొట్టుకోవడంతో పాఠశాల ఆవరణ కుస్తీ వేదికగా మారింది. వీరిద్దరి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే.. ఒకరి జుట్టును ఒకరు లాగ్కుంటూ.. పిడిగుద్దుల వర్షం కురిపించుకుంటూ.. కాళ్లతో తన్నుకుంటూ గొడవకు పాల్పడ్డారు. ఈ సమయంలో అక్కడున్న గ్రామస్థులు ప్రేక్షకులు మౌనంగా ఉండిపోయారు. ఈ మొత్తం ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ విషయమై పంచాయతీ ప్రధానాధికారి రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇద్దరు మహిళా ఉపాధ్యాయుల మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోందన్నారు. అయిదు నెలల క్రితం కూడా ఈ విషయమై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి, పంచాయతీ ప్రతినిధుల మధ్య సమావేశం నిర్వహించి సద్దుమణిగిన నేపథ్యంలో మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఉపాధ్యాయులిద్దరినీ బదిలీ చేయాలని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారిని కోరారు.
మార్గదర్శకాలపై చర్యలు తీసుకుంటాం - బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్
ఈ విషయంపై బిహ్తా బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నభేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటన బ్లాక్లోని కౌరియా పంచాయతీ మిడిల్ స్కూల్కు సంబంధించినది. ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వ్యక్తిగత వివాదం ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.